అమీర్పేట్, ఆగస్టు 10: పంపింగ్ సామర్థ్యం తగ్గి..బలహీనంగా మారిన గుండెకు ‘కార్డిక్ రీహ్యాబ్ ప్రోగ్రామ్’తో జవసత్వాలు నింపి పూర్ణాయుష్షును ప్రసాదిస్తున్నారు ఈఎస్ఐసీ వైద్యులు. స్టంట్లు, బైపాస్ సర్జరీ వంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు జీవతకాలం భయాందోళనలతో కాలం వెళ్లదీస్తుంటారు. అయితే పంపింగ్ సామర్థ్యం తగ్గిన గుండెకు పూర్వపు స్థితిని అందించేందుకు ‘కార్డిక్ రీహ్యాబ్’ ఎంతో దోహదపడుతున్నది. బాధితులు గుండె అవసరాలను బట్టి కొన్ని వ్యాయామాలు చేయించడం ద్వారా పూర్వ స్థితికి తేగలుగుతున్నారు.
వ్యాయామం చేయొచ్చు..
సనత్నగర్ ఈఎస్ఐసీ కన్సల్టెంట్ కార్డియాక్ రీహ్యాబ్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీధర్ పదుల సంఖ్యలో గుండె వ్యాధులకు గురైన వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చిన విధానాన్ని బుధవారం వైద్య కళాశాలలో జరిగిన సమావేశంలో వివరించారు. ‘కార్డిక్ రీహ్యాబ్ ప్రోగ్రామ్’ ద్వారా అంతకు ముందు గుండె సంబంధ వ్యాధులున్న వారు నిర్భయంగా తమ దైనందిన జీవితాన్ని ఎటువంటి భయాందోళనలు లేకుండా గడపవచ్చన్నారు. గుండె అలసట, ఆయాసం వంటివి ఈ చికిత్స తరువాత ఉండవని స్పష్టం చేశారు.
ఈ చికిత్సలో ఎటువంటి మందులు, శస్త్రచికిత్సలు ఉండవని, తమ గుండె అనువైన వ్యాయమాలైన ట్రేడ్మిల్, ఏఆర్ఎం ఎర్గోమీటర్, సైకిల్ ఎర్గోమీటర్, స్టెప్ ఎరోబిక్స్ వంటివి మూడు నెలల పాటు చేస్తే సరిపోతుందని, అయితే ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంభిస్తే గుండెకు ఎటువంటి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. సహజంగా గుండె జబ్బులున్న వారు వాకింగ్, జాగింగ్, వ్యాయామాల వంటి చేయరాదన్న ఆలోచనతో ఉంటారని, అయితే ఈ ‘కార్డిక్ రీహ్యాబ్ ప్రోగ్రామ్’ చికిత్స తరువాత వ్యాయామాలు, నడక వంటివి పూర్తి స్థాయిలో చేయవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో ఈఎస్ఐసీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.కె.పాల్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ, కార్డియాక్ విభాగం హెచ్వోడీ డాక్టర్ సదానందరెడ్డి, కార్డియో థోరాసిక్ విభాగం హెచ్వోడీ డాక్టర్ అభిజిత్, పీఎంఆర్ విభాగం హెచ్వోడీ డాక్టర్ సుష్మతో పాటు పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మారథాన్లో పాల్గొంటా..
2021లో హైపర్ టెన్షన్ కారణంగా గుండె సంబంధిత సమస్యలు ఏర్పడడంతో స్టంట్లు వేశారు. దీంతో జీవితం నెమ్మదించిందని తీవ్ర నిరాశకు లోనయ్యా. అయితే సనత్నగర్ ఈఎస్ఐసీలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘కార్డిక్ రీహ్యాబ్ ప్రోగ్రామ్’ ద్వారా చక్కటి వ్యాయామాలు చేయడంతో నా గుండెను నేను కాపాడుకోగలిగాను. ఇటీవలే నేను 10 కి.మీ వాకథాన్లో పాల్గొన్నా. ఆగస్టు 28న జరుగబోతున్న మరో మారథాన్లో పాల్గొంటా.
– రమాదేవి గృహిణి, సనత్నగర్
బరువైన పనులు చేసుకోగలుగుతున్నా..
2008 నుంచి గుండె సంబంధ సమస్యలున్నాయి. గుండె క్రమంగా పెద్దదవుతుండడంతో పంపింగ్ సమస్య ఏర్పడింది. దీంతో విపరీతమైన ఆయాసం, అడుగులు వేయలేని పరిస్థితులు తలెత్తాయి. ప్రతి రోజు పదుల సంఖ్యలో మందులు మింగాల్సిన పరిస్థితి. అయితే సనత్నగర్ ఈఎస్ఐసీలో ‘కార్డిక్ రీహ్యాబ్ ప్రోగ్రామ్’ ద్వారా వ్యాయామాలు చేసిన తరువాత ఇప్పుడు బలమైన పనులు చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు కేవలం రెండు రకాల మందులు మాత్రమే వాడుతున్నా.
– దుర్గయ్య, రైతు, గజ్వేల్