ఖైరతాబాద్, ఆగస్టు 7: కన్న బిడ్డపై ఆ తండ్రి కర్కషం ప్రదర్శించాడు. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారన్న పోపంతో మూడేండ్ల పాపను గరిటతో కొట్టి, బండ కేసి బాధాడు. ఈ ఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడిపోగా, ఉస్మానియా దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకున్నది.
సీఐ సత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీగార్డ్స్లో నివాసముండే సనా ఫాతిమా, మహ్మద్ బాసిత్ ఖాన్కు 2015లో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమార్తెలు ఉండగా, ప్రస్తుతం సనా ఫాతిమా ఎనిమిది నెలల గర్భవతి. బాసిత్ ఖాన్ ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా మూడో కుమార్తె సకినా ఫాతిమా (3)ను కొడుతూ, హింసిస్తూ వస్తున్నాడు. శనివారం పాప వాష్రూమ్లో ఆడుకుంటుండగా, బయటకు రమ్మని గద్దించాడు.
పాప రాకపోవడంతో ఇంట్లోని ఓ గరిటను తీసుకొని తీవ్రంగా కొట్టాడు. తల్లి సనా ఫాతిమా అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమెను పక్కకు తోసేశాడు. అంతటితో ఆగకుండా ఆ పాపను గట్టిగా నేలకేసి కొట్టాడు. నిండు గర్భిణి అయిన తల్లి అతి కష్టమీద లేచి పాపను లేపే ప్రయత్నం చేయగా స్పందించలేదు. వెంటనే కుటుంబ సభ్యులు నీలోఫర్ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు ఉస్మానియా దవాఖానకు పంపించారు.
అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. వరుసగా ఆడపిల్లలు పుట్టారన్న ఉద్దేశ్యంతోనే పాపపై తన కర్కషత్వాన్ని ప్రదర్శించాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాసిత్ ఖాన్ను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.