ప్రజలకు అవసరమయ్యే నూతన నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ఒకడుగు ముందే ఉందని, స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని స్వాతంత్య్ర ఉద్యమకారుడు నూతి శంకర్రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని టేక్మాల్కు చెందిన శంకర్రావు 1963లో సిద్దిపేటలో రెవెన్యూ విభాగంలో పనిచేశారు. డిప్యూటీ కలెక్టర్ హోదాలో రిటైరయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏండ్లు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన సందర్భంగా శంకర్రావును నమస్తే తెలంగాణ పలుకరించింది.
– సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ)
రామానంద తీర్థ పిలుపుతో..
1947 డిసెంబర్లో నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థ ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా సత్యాగ్రహాలు, ర్యాలీల్లో పాల్గొన్నాను. పాఠశాలను బాయ్కాట్ చేశాను. రెడ్డి హాస్టల్లో 50 మంది విద్యార్థులు సమావేశమై చర్చించుకునేవాళ్లం. 1948 మార్చి వరకు దక్కన్ హైదరాబాద్లో ఉద్యమం ఉధృతమైంది. మార్చి 8న ఉదయం ర్యాలీ తీస్తుండగా 21మందిమి అరెస్టయ్యాము. ఇందులో బి.సత్యనారాయణరెడ్డి, బోనాల కిషన్రావు, మాధవరెడ్డి, వెంకట్రావ్, భరత్రెడ్డి, బల్వంత్రెడ్డి తదితరులు చంచల్గూడ జైలులో ఉన్నాం. జైలు నుంచే ‘పయా-మే-నౌ’ (కొత్త సందేశం) మాస పత్రికలో ఆర్టికల్స్ రాసేవాళ్లం. అందులో నేను రాసింది స్వాతంత్య్రం రాకుంటే.. ‘హైదరాబాద్ కా ముసక్ ్త బిల్’ (హైదరాబాద్ భవిష్యత్తు ఏమైతది) రామానంద తీర్థను కదిలించింది. అట్లా స్వాతంత్రోద్యమాన్ని జైల్లో నుంచే రగిలించాం.