సికింద్రాబాద్, జూలై 21:పాలు.. ప్రతి ఒక్కరి నిత్యావసరం. మరీ ముఖ్యంగా పిల్లలకు పౌష్టిహాకారం.. అలాంటి పాలు, అనుబంధ ఉత్పత్తులపై ఏమాత్రం ఆలోచన లేకుండా కేంద్రం జీఎస్టీ విధించడంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. రోజురోజుకూ ధరల భారం మోపుతున్న బీజేపీ సర్కారు తీరుపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ కంటోన్మెంట్లోని టివోలి చౌరస్తా వద్ద ‘మోదీజీ కుచ్ జీఎస్టీ హోజాయే..!’ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘పిల్లలకు కనీసం పాలు కూడా లేకుండా చేస్తారా’ అంటూ ప్రజలు మండిపడుతున్నారు. అదేవిధంగా అంత్యక్రియల సేవలపైనా కేంద్రం జీఎస్టీని విధించడంతో.. చచ్చిన తర్వాత కూడా జీఎస్టీ కట్టాలా? అంటూ జనాగ్రహం కట్టలు తెంచుకుంటున్నది.
జీఎస్టీ రద్దు చేసే వరకు పోరాటం
పాలు, నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధింనందుకు పాల క్యాన్లతో గురువారం మల్కాజిగిరి సాయినగర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలపై పన్నుల భారం పడుతుందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జీఎస్టీని రద్దు చేయాలని అన్నారు. జీఎస్టీ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల సునీతారాముయాదవ్, ప్రేమ్కుమార్, మాజీ కార్పొరేటర్ ఎన్.జగదీశ్గౌడ్, మేకల రాముయాదవ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నెలవారీ బడ్జెట్ తలకిందులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నది. ఇష్టానుసారంగా పెంచుతున్న జీఎస్టీ కారణంగా సామాన్యుడి బతకలేని పరిస్థితి ఏర్పడుతున్నది. నిత్యవసరాలపై కూడా జీఎస్టీ వేయడం వల్ల వేతనాలపై ఆధాపడి జీవించే వారి నెలవారీ బడ్జెట్ తలకిందులు అవుతున్నది. సామాన్యుడిపై ప్రభావం చూపే వస్తువులపై వేసిన జీఎస్టీని వెంటనే తగ్గించాలి.
బతికితే పన్నులు వేస్తారేమో..
బీజేపీ పాలనలో సగటు పేదల జీవనం అగమ్యగోచరంగా మారింది. పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులపై జీఎస్టీ విధింపుతో సామన్య ప్రజలపై భారం పడుతుంది. బతికితే కూడా లైఫ్ ట్యాక్స్ పేరుతో పన్నులు వేస్తరేమో.. వెంటనే కేంద్రం జీఎస్టీని వెనక్కు తీసుకోవాలి.
– లక్ష్మి, ప్రైవేటు ఉద్యోగి, జవహర్నగర్
సామాన్యుల ఉసురు తగులుతుంది
కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతూ కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తున్నది. పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. నిత్యావసరాలపై వేసిన జీఎస్టీని తగ్గించాలి. లేదంటే ప్రభుత్వానికి సామాన్యుల ఉసురు తగులుతుంది.
– స్వప్న, మేడ్చల్
పేదలకు చేసిందేమీ లేదు
పనిచేసుకుంటేనే బ్రతికేటోళ్లం… ప్రతి వస్తువుపై ట్యాక్స్లు పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం.బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదు. గ్యాస్ ధరలు పెంచి కట్టెలపొయ్యి పెట్టుకునే పరిస్థితికి దిగజార్చింది మోదీ ప్రభుత్వం. ఇంధనం ధరలు ఆకాశానికి అంటుతుంటే తినే వస్తులపైనా ధరలు పెంచి పేదోడి నడ్డి విరుస్తున్నారు.
– అరుణ, చిరు వ్యాపారి, గబ్బిలాల్పేట
జీఎస్టీని తక్షణమే ఉపసంహరించుకోవాలి
బీజేపీ పాలనలో పేదల జీవనం అగమ్యగోచరంగా మారింది. పాల ఉత్పతులు, ఇతర వస్తువులపై జీఎస్టీ విధింపుతో సామాన్య ప్రజలపై భారం పడుతుంది. ఉద్యోగ కల్పన, సంక్షేమం, అభివృద్ధి సరిగా లేకున్నా ప్రజల నుంచి మాత్రం ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారు. వెంటనే కేంద్రం జీఎస్టీని ఉపసంహరణ చేసుకోవాలి.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కంటోన్మెంట్
సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నది. మోదీ ప్రభుత్వ పాలనలోనే నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయి. పేద ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తానన్న మోదీ చివరికి ప్రజలు కడుపు నిండా తినకుండా చేస్తున్నాడు. పేద ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకూ వెనుకాడం.
– గజ్జెల నాగేశ్, చైర్మన్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్
కేంద్ర ప్రభుత్వ పతనం ఖాయం
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువులు ధరలు మండిపోతున్నాయి. తినే ఆహార పదార్థాలపైనే పన్నుల భారం మోపడం మోదీ ప్రభుత్వానికి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నది. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నది. పాల ఉత్పత్తులపై 5శాతం జీఎస్టీని తగ్గించకుంటే కేంద్ర ప్రభుత్వం పతనమవడం ఖాయం.
– మర్రి రాజశేఖర్రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి
కేంద్ర ప్రభుత్వం మారితేనే మనుగడ
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెట్రో రేట్లు పెరుగడంతో ఆటోమెటిక్గా అన్ని రకాల ధరలు చుక్కలనంటాయి. ఇక పాలు, పాల ఉత్పత్తులకు కూడా జీఎస్టీ విధిస్తే పేదలు ఎలా బతకాలి. కేంద్ర ప్రభుత్వం అంత్రక్రియల సేవలపైనా పన్ను విధించి చచ్చినా సరే జీఎస్టీ కట్టాలనడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వాన్ని మారిస్తేనే ప్రజలకు మనుగడ.
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు