బంజారాహిల్స్,జూలై 17: కాలనీవాసుల పట్టుదల.. జీహెచ్ఎంసీ అధికారుల సహకారం.. అర్బన్ బయోడైవర్సిటీ విభాగం సిబ్బంది కృషి… ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి తీవ్రమైన దుర్వాసనలు వెదజల్లే పార్కు స్థలం నేడు భారీ వృక్షాలతో కళకళలాడుతోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా మూడేళ్ల క్రితం నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఎకరం విస్తీర్ణంలోని పార్కు స్థలంలో చెత్తాచెదారం వేసేవారు. దీనికి తోడు జీహెచ్ఎంసీకి చెందిన రవాణా విభాగానికి సంబంధించిన పాతటైర్లు, ఇతర వస్తువులను ఇక్కడే భద్రపర్చేవారు. ఈ స్థలంలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని కాలనీవాసులు మూడేళ్ల క్రితం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు. దీంతో పార్కు స్థలం చుట్టూ ప్రహరీని నిర్మించడంతో పాటు జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా వందల సంఖ్యలో మొక్కలు నాటారు. క్రమం తప్పకుండా నీళ్లు పోయడంతో ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి భారీ వృక్షాలుగా మారుతున్నాయి. వాకింగ్ ట్రాక్, బెంచీలతో పార్కులో ఆహ్లాదం వెల్లివిరుస్తోంది. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు వెయ్యికి పైగా మొక్కలు..
నిరుపయోగంగా ఉన్న పార్కుస్థలాలన్నింట్లో గ్రీనరీ పెంచడంతో పాటు వాకర్లకు అవసరమయ్యే సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండున్నర ఏళ్ల క్రితం ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటాం. వివిధ రకాలైన వెయ్యికి పైగా మొక్కలు నాటడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
వాకింగ్ ట్రాక్ నిర్మించడంతో కాలనీవాసులు వాకింగ్ కోసం వస్తున్నారు. నిర్వహణ కోసం సిబ్బందిని కూడా నియమించాం.
-బాలయ్య, జీహెచ్ఎంసీ సర్కిల్ -18, యూబీడీ విభాగం