హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాలు ఎదురుచూసిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజంచేసిన ఒక అసామాన్య వ్యక్తి కే చంద్రశేఖర్రావు అని, ఆయన ఒక ఉద్యమ శక్తే కాకుండా దార్శనికుడు, వ్యూహకర్త, విభిన్న రాజకీయవేత్త అని ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత మనోహర్ చిమ్మని కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం తనదైన శైలిలో సంచలనాలు సృష్టించబోతున్న ప్రస్తుత సందర్భంలో ఒక నంది అవార్డు గ్రహీతగా, ఫిలిం డైరెక్టర్గా, సీఎం కేసీఆర్ అభిమానిగా, తెలంగాణ బిడ్డగా ఆయనకు తాను అందిస్తున్న చిరు కానుక ‘కేసీఆర్- ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ పుస్తకం అని పేర్కొన్నారు. కేసీఆర్ కేంద్రబిందువుగా తెలంగాణ ఉద్యమంలోని వివిధ అంశాలపై, ఉద్యమానంతర విషయాలపై ఆయా సందర్భాల్లో తన ఆలోచనలను మనోహర్ తన బ్లాగ్లో రాశారు. పత్రికల ఎడిట్ పేజీల్లో వ్యాసాలు రాయడంతోపాటు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీటన్నింటినుంచి ఎంపికచేసిన కొన్ని వ్యాసాల సంకలనమే ‘కేసీఆర్-ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ పుస్తకం. రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ప్రగతిభవన్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ, ఎవ్వరూ ఊహించని తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ సాధించారని, రాష్ట్ర సాధనకోసం అందరినీ కలుపుకొనిపోయారని, చివరికి ఆమరణ నిరాహారదీక్ష కూడా చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రిగా ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తిచేశారని అన్నారు. గతంలో దేశంలో కనీవినీ ఎరుగని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ అనేక రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపారని చెప్పారు. అయినా కొందరు కేసీఆర్ను దూషిస్తున్నారని, అనరాని మాటలు అంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేస్తూ, ఇలాంటి సమయంలో మనోహర్ వంటి రచయిత శ్రమించి కేసీఆర్పై ఒక మంచి పుస్తకాన్ని తేవడం అభినందనీయమని అన్నారు. తాను పుస్తకాన్ని చదవడమే కాకుండా దీనిపై తన అభిప్రాయాన్ని, రివ్యూను ట్వీట్ చేస్తానని చెప్పారు.
పూర్తి వాస్తవ ఘటనలతో కూడిన పుస్తకం: మనోహర్
ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం ద్వారా తనకు ఇచ్చినమాటను నిలబెట్టుకుంటూ కేటీఆర్ తన పుస్తకాన్ని ఆవిష్కరించడం తన జీవితంలో మర్చిపోలేని అద్భుత జ్ఞాపకంగా ఉండిపోతుందని పుస్తక రచయిత మనోహర్ ఆనందం వ్యక్తంచేశారు. తాను చేసిన ఈ ప్రయత్నాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం మరెందరో ముందుకు రావాలని ఆకాంక్షించారు. కొందరి గురించి ఎంత నిజం రాసినా అది పొగడ్తగానో, భజనగానో అనిపిస్తుందని, అయితే తాను కేసీఆర్ గురించి బ్లాగులో రాసినవి, పేపర్లలో రాసిన వ్యాసాలు అన్నీ వాస్తవాలేనని చెప్పారు. కళ్లముందు కనిపించే విషయాలను, సాధించిన విజయాలనే రాసినట్టు మనోహర్ వివరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి బైరి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.