గోల్నాక, జూలై 5 : ప్రస్తుతం మార్కెట్లో ఆదాయాన్నిచ్చే వ్యాపారాలు ఎంచుకోవడంతో పాటు తమకు అనుభవం ఉన్న రంగంలో రాణిస్తూ మరో పది మందికి ఉపాధి కల్పించాలని దళితబంధు లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. మంగళవారం గోల్నాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెండవ విడత కింద ఎంపికైన లబ్ధిదారులకు పథకంపై ఆయన అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురువుతున్న దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పుకోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేశామని, మరో 1500 కుటుంబాలకు వర్తింపజేస్తామన్నారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి పథకం ప్రయోజనాన్ని వర్తింప జేస్తామని ఆయన తెలిపారు. లబ్ధిదారులు తమకు ఇష్టమైన రంగంలో రాణించి దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆదాయాన్ని ఇచ్చే యూనిట్లు ఎంపిక చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
‘దళితబంధు’తో కోటీశ్వరులు కావాలి..
లబ్ధిదారులు దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని కోటీశ్వరులు కావాలని ఎమ్మెల్యే వెంకటేశ్ ఆకాంక్షించారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మంగళవారం గోల్నాక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాగ్అంబర్పేట డివిజన్ బతుకమ్మకుంటకు చెందిన శ్రీనివాస్కు దళితబంధు పథకం కింద మంజూరైన రూ.10లక్షల విలువ చేసే భూ సర్వే చేసే ఆధునిక పరికరాలను ఆయన అందజేశారు. దళితబంధు పథకం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత నాయకులు పాల్గొన్నారు.