సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ);కచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే డబుల్ బెడ్రూం అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ బల్దియా అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారులకు అందించే ప్రక్రియ ప్రారంభంపై సోమవారం నానక్రామ్గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో పురపాలక శాఖ, హౌసింగ్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణ ప్రక్రియలో భాగంగా 60,000 పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నిర్మించిన ఇండ్ల పంపిణీకి సంబంధించి.. రాష్ట్ర హౌసింగ్ అధికారుల సమన్వయంతో వారం రోజుల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని లబ్ధిదారుల ఎంపిక ఉండాలన్నారు. అర్హుల ఎంపికకు అవసరమైన క్షేత్రస్థాయి గుర్తింపు, వెరిఫికేషన్ వంటి ప్రక్రియల కోసం పెద్ద ఎత్తున బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వచ్చేవారం మరోసారి ఈ అంశంపై సమావేశం ఉంటుందని తెలిపిన మంత్రి కేటీఆర్.. ఆలోగా తుది మార్గదర్శకాలు, సమగ్ర కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.