కొండాపూర్, జూలై 4 : విద్యా సంస్థలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల అనుసంధానం, ఏకీకరణ సాధనలో యూనివర్సిటీలు గొప్ప పాత్ర పోషించాలని కేంద్ర విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్, ఆంత్రప్రెన్యూర్షిప్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రూ. 62.85 కోట్లతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ డిజిటల్ లర్నింగ్ అండ్ ట్రైనింగ్ రీసోర్సెస్ (సీడీఎల్టీఆర్) భవనాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశాన్ని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దేందుకు ‘ఎన్ఈపీ -2020’ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని యువతలో మెరుగైన స్కిల్స్ను అభివృద్ధి చేసేందుకు సహాయమార్గంగా ముందుకు సాగుతుందన్నారు. హెచ్సీయూలోని సెంటర్ ఫర్ డిజిటల్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ రీసోర్సెస్ తెలంగాణ, దక్షిణ భారతదేశానికి విజ్ఞాన కేంద్రంగా ఆవిర్భవిస్తున్నదని తెలిపారు. అనంతరం ఆయన వర్సిటీలోని సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చాన్స్లర్ జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావు, ప్రొఫెసర్ ఆర్ఎస్. సర్రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ దేవేశ్ నిగమ్, ఫ్యాకల్టీ సభ్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.