సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) / కవాడిగూడ : వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే… అలాంటి వీరున్ని, వీరత్వాన్ని గుర్తుచేసుకోవాల్సినవసరం ప్రతి భారతీయుడి విధి అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ క్షత్రియ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ట్యాంక్బండ్పై స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామారాజు 125వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామారాజు విగ్రహానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, వివేకానంద, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్, జీవన్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణతో కలిసి మంత్రి కేటీఆర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ ఆసిఫాబాద్లో జన్మించిన కొమురం భీమ్ జల్ జంగల్ జమీన్ నినాదంతో ఈ ప్రాంత గిరిజనుల హక్కుల కోసం పోరాడారని, అల్లూరి సీతారామారాజు కూడా ఆంగ్లేయుల మీద ధీరోదాత్తంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. క్షత్రియుల కోసం హైదారబాద్లో 3 ఎకరాల స్థలాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారని, త్వరలో భవన నిర్మాణం పూర్తి చేసి అల్లూరి పేరును పెట్టుకోవడం సముచితమని అన్నారు. క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అల్లూరి సీతారామారాజు తన 27వ ప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించిన మన్యం వీరుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముషీరాబాద్ సర్కిల్-15 ఏఎంహెచ్వో మైత్రేయి, క్షత్రీయ సేవా సమాజ్ ప్రతినిధులు వర్మ, శ్యామల్ రాజు, మైనర్ రాజు, రామరాజు, వరదరాజు, ఆగ్బాన్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.