మెహిదీపట్నం, జూలై 4 : యూసుఫ్గూడ కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ ముఠాను సోమవారం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు, ఎస్ఆర్నగర్ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారివద్ద నుంచి 3 లక్షల విలువ చేసే 30 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జోయల్డేవిస్, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ డి.సునీత రెడ్డి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన అనూప్ నవనాథ్ (32) ఢిల్లీలో ఓ నైజీరియన్ వద్ద నుంచి డ్రగ్స్ను కొనుగోలుచేసి నగరంలోని యూసుఫ్గూడ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
అతడి వద్ద నుంచి యూసుఫ్గూడకు చెందిన మహ్మద్ అబ్దుల్ నదీం(29), మహ్మద్ ఖాజా ముబినుద్దీన్(23), తౌహీద్ రజాఅహ్మద్, షంషుద్దీన్ అలియాస్ సామ్, సులేమాన్, యూసుఫ్ అలియాస్ పార్టీ, సుమేర్లు డ్రగ్స్ను తీసుకొని అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు, ఎస్ఆర్నగర్ పోలీసులతో కలిసి సోమవారం సాయంత్రం ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద దాడి చేసి ప్రధాన నిందితుడు అనూప్ నవనాథ్, మహ్మద్ అబ్దుల్ నదీం, మహ్మద్ ఖాజీ ముబినుద్దీన్లను పట్టుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. ఈ సమావేశంలో నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, ఎస్ఐ జీఎస్ డేనియల్ ఉన్నారు. డ్రగ్స్కు యువత, విద్యార్థులు బానిసలు కావద్దని, డ్రగ్స్ను విక్రయిస్తున్నట్లు తెలిస్తే 9490616688 నంబర్లో సమాచారం ఇవ్వాలని డీసీపీ తెలిపారు.