ఇఫ్లూలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర
సికింద్రాబాద్, జూలై 4: భాషా శక్తితో అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ ప్రపంచ క్రమంలో గేమ్ ఛేంజర్గా ఇఫ్లూ విశ్వవిద్యాలయం ముందుండాలని కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. సోమవారం ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ ) క్యాంపస్లో యాంఫీ థియేటర్, మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్- కమ్-ఆడిటోరియంను ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కేంద్ర మంత్రి ప్రారంభించారు. దీంతో పాటు జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్ వంటి ఐదు విదేశీ భాషలలో అభివృద్ధి చేసిన ఓపెన్ లాంగ్వేజ్ లెర్నింగ్ రీసోర్సెస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. 21వ శతాబ్దంలో భాష కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు.
అణగారిన వర్గాలకు బహుభాషా విధానంలో శిక్షణ ఇవ్వాలని, తద్వారా ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు వీలు కల్పించాలని పిలుపునిచ్చారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, నిపుణుల విషయంలో ఇఫ్లూ విశ్వవిద్యాలయం పాత్రను మంత్రి ప్రస్తావిస్తూ, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఎంచుకున్న రంగాల్లో రాణించేలా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్లూ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ సురేశ్ కుమార్, ఇఫ్లూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ పాల్గొన్నారు.