ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 3 : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ హైదరాబాద్ రీజనల్ సెంటర్ (ఐఐసీహెచ్ఈ-హెచ్ఆర్సీ) 63వ వార్షిక సదస్సును ఆదివారం హబ్సిగూడలోని హోటల్ బ్లూ ఆర్చిడ్లో నిర్వహించారు. ఈ సదస్సుకు రెండు తెలుగు రాష్ర్టాల నుంచి శాస్త్రవేత్తలు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హెచ్ఆర్సీ చైర్మన్, ఏఆర్సీఐ శాస్త్రవేత్త డాక్టర్ సంజయ్ భరద్వాజ్ మాట్లాడుతూ గత ఏడాది వార్షిక సమావేశం మినట్స్ను ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
రెండు సార్లు రీజనల్ అవార్డులు
హెచ్ఆర్సీ కార్యదర్శి డాక్టర్ సాదం అయిలయ్య మాట్లాడుతూ గత ఏడాది కాలంలో తమ ఆధ్వర్యంలో చేసిన సదస్సులు, వర్క్షాప్లు, సెమినార్లు, వివిధ కార్యక్రమాలతో కూడిన నివేదికను వివరించారు. ఈ కార్యక్రమాలకు 2019, 2021లో రెండు సార్లు జాతీయ స్థాయిలో బెస్ట్ రీజనల్ సెంటర్ అవార్డును దక్కించుకుందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా అవార్డు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోశాధికారి డాక్టర్ ముకుందావాణి మాట్లాడుతూ ఏడాది కాలంలో వచ్చిన ఆదాయ వ్యయాలను సభ్యుల ముందుంచారు.
అవార్డుల ప్రదానం
అనంతరం ఐఐసీహెచ్ఈ మాజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.వెంకటేశ్వర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ.భాస్కర్రెడ్డి, జీవీ సేతురామన్లు అందించిన సేవలకు గుర్తింపుగా వారికి అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు – 2022ను ప్రదానం చేశారు. డాక్టర్ రవిచంద్ర పాలపర్తికి ఉత్తమ ఈసీ మెంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందజేశారు. గతనెలలో ఓయూ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన అంతర్ కళాశాల పోటీల్లో గెలుపొందిన వివిధ కళాశాలల విద్యార్థులకు నగదు బహుమతులు, అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐసీహెచ్ఈ హెచ్ఆర్సీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ శశికళ, ఓయూ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింత సాయిలు, మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జయప్రకాశ్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ రమేశ్కుమార్, ప్రతినిధులు సీపీ రాములు, శీల, శృతికీర్తి, డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్, డాక్టర్ జీకే ఆనంద్, డాక్టర్ అమరేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.