మేడ్చల్, జూలై 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలలో అమలు చేసే దమ్ము బీజేపీకి ఉందా? అని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రశ్నించారు. శంభీపూర్ రాజు శనివారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా ప్రజలందరూ అభినందిస్తున్నారన్నారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయాలని అక్కడి రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు వస్తున్న ఆదరణ చూసి బీజేపీ తట్టుకోలేక పోతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసింది ఎమైనా ఉంటే చెప్పాలని శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్పై అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని, బీజేపీ ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీజేపీ ఎన్ని దండయాత్రలు చేసినా ప్రజల ఆదరణ ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఎమీ చేయలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే బీజేపీకి మింగుడు పడటం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను జాతీయ రాజకీయాలకు బీజేపీ యేతర పార్టీల నాయకులందరూ ఆహ్వానిస్తుంటే బీజేపీ నాయకులలో వణుకు మొదలైందన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్వహించే బీజేపీ సభలతో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీలేదని శంభీపూర్ రాజు అన్నారు.