ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 2 : కష్టపడి ప్రణాళిక ప్రకారం చదివితే పోటీ పరీక్షల్లో తప్పక విజయం సాధించవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. భిన్న నేపథ్యాల నుంచి సివిల్ సర్వీసెస్ సాధించి చూపిన అభ్యర్థుల జీవితాలు ప్రేరణగా తీసుకుని జీవితంలో విజయం సాధించాలని సూచించారు. ఓయూ, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంయుక్తంగా ఉద్యోగార్థులకు ఇటీవల విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. టాపర్లుగా నిలిచిన వారిని ఘనంగా సన్మానించారు. సివిల్స్ సాధించే క్రమంలో ఎదురైన అనుభవాలను వారు విద్యార్థులతో పంచుకున్నారు.
ఓయూలోని ఠాగోర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బుర్రా వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు అలుపెరుగక శ్రమించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది కనీసం పది నుంచి పదిహేను మంది ఓయూ విద్యార్థులు సివిల్స్ సాధించి ఇదే వేదికపై నుంచి మాట్లాడాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను సైతం సివిల్స్ సాధించేలా ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు.
త్వరలోనే అన్ని సౌకర్యాలతో ఓయూ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ అకాడమీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ‘విద్యార్థిగా చేరండి, సివిల్ సర్వెంట్గా వెళ్లండి’ అనే నినాదంతో ప్రణాళికను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్కుమార్, ఓఎస్డీ ప్రొఫెసర్ రెడ్యానాయక్, ఓయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ డైరెక్టర్ డాక్టర్ సయీదా అజీమ్ ఉన్నీసా, విద్యార్థులు పాల్గొన్నారు.
సివిల్స్ సాధించిందిలా..