తెలుగు యూనివర్సిటీ, జూలై 1: కళాకారులకు ప్రేమ, వాత్సల్యం మెండుగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వర్సిటీ సమావేశ మందిరంలో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజ్ఞ గ్రూప్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్య గురువు కళాకృష్ణ పర్యవేక్షణలో ఆంధ్ర నాట్యం – పేరిణి నృత్యాంశాలను పలువురు ఔత్సాహిక కళాకారులు ప్రదర్శించి నటరాజ రామకృష్ణకు నృత్య నీరాజనం అర్పించారు. ఈ సందర్భంగా కేవీ రమణాచారి మాట్లాడుతూ నటరాజ రామకృష్ణ కృషిని గుర్తించి పీవీ నరసింహారావు హయాంలో పద్మశ్రీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఆంధ్రనాట్యం – పేరిణి నృత్య కళను వికసించేలా నటరాజ రామకృష్ణ శిష్యులు కృషి చేయాలని సూచించారు. ఆయన ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా శిష్యులు పూర్తి స్థాయిలో కృషి చేయడం లేదని రమణాచారి ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీ వీసీ కిషన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎస్ఎన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నృత్య శాఖాధిపతి ప్రొఫెసర్ అనూరాధ తడకమళ్ళ పాల్గొని నటరాజ రామకృష్ణ వ్యక్తిత్వం, ‘ఆంధ్ర నాట్యం – పేరిణి తాండవం’ నృత్యకళకు ఆయన చేసిన కృషి తదితర అంశాలపై ప్రసంగించారు. తెలుగు యూనివర్సిటీ నృత్య శాఖాధిపతి డాక్టర్ వనజా ఉదయ్, వర్సిటీ పీఠాధిపతి ఆచార్య కోట్ల హనుమంతరావు, ప్రొఫెసర్ భాగవతుల సేతురాం పాల్గొని నటరాజ రామకృష్ణ నృత్య కళకు చేసిన ఘనతను కొనియాడారు.