తెలుగు యూనివర్సిటీ, జూలై 1: ప్రతిభ కనబరిచిన పారిశ్రామికవేత్తలకు జూలై 4న హెచ్ఐసీసీలో ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి వెల్లడించారు. రెడ్హిల్స్లో గల ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఎఫ్టీసీసీఐ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ పారిశ్రామికవేత్తలకు ఎక్సలెన్సీ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొని ఆయా సంస్థలకు అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు. అవార్డు కమిటీ చైర్మన్ గౌర శ్రీనివాస్ మాట్లాడుతూ, 22 కేటగిరీలలో నామినేషన్లను ఆహ్వానించగా, 150 నామినేషన్లు వచ్చాయని, వాటిని అన్ని విధాలుగా పరిశీలించి 19 విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు మీలా జయదేవ్, సీఈఓ ఖ్యాతి నర్వానీ, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రాతో పాటు అవార్డుకు ఎంపికైన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.