అబిడ్స్, జూలై 1: ఇటీవల కుల ఉన్మాదంతో నీరజ్ పన్వర్ను హత్య చేసిన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా, తమకు న్యాయం జరిగేలా చూడాలని నీరజ్ పన్వర్ సతీమణి, కుటుంబ సభ్యులు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసి విన్నవించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద కిశోర్ వ్యాస్ నేతృత్వంలో మృతుడి భార్య సంజన పన్వర్, తల్లి నిషా పన్వర్, తాత జుగల్ కిశోర్ సాంక్ల, కుల పెద్దలు, బేగంబజార్ డివిజన్ టీఆర్ఎస్ ఇన్చార్జి పూజా వ్యాస్ బిలాల్తో మంత్రి కేటీఆర్ను శుక్రవారం కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో మాట్లాడి ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా నీరజ్ పన్వర్ హత్య కేసులో నిందితులకు వెంటనే శిక్ష పడేలా చూడాలని ఆదేశించినట్లు నంద కిశోర్ వ్యాస్ తెలిపారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తున్నదని, నిందితులకు చట్టపరంగా శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకుంటుందని బాధితులకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
అనంతరం, గోషామహల్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పార్టీ సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులకు నామినేటెడ్ పదవులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేయగా, తప్పక వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చినట్టు వివరించారు.