బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి సొంత గ్రామానికే విద్యుత్ సౌకర్యం లేదు
ఆర్మీని ఔట్ సోర్సింగ్ చేయాలనే ఉద్దేశంతోనే అగ్నిపథ్
కేంద్రం తీరుపై మంత్రి తలసాని ఫైర్
నేడు యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలకనున్న గులాబీ శ్రేణులు
సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ) : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం నగరానికి రానున్న నేపథ్యంలో ఘనస్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. నగరంలోని ముఖ్యమైన కూడళ్లతో పాటు బేగంపేట నుంచి జలవిహార్ వరకు స్వాగత తోరణాలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి జలవిహార్ వరకు దాదాపు ఆరువేల బైకులతో ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పీవీ మార్గ్లోని జలవిహార్లో సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జలవిహార్లో యశ్వంత్ సిన్హా పాల్గొనే సభ ఏర్పాట్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ప్రభాకర్తో కలిసి పరిశీలించారు.
కేంద్రంలో ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడమే ఇందుకు నిదర్శనంగా మంత్రి తలసాని పేరొన్నారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి సొంత గ్రామానికే విద్యుత్ సౌకర్యం లేకపోవడం శోచనీయమన్నారు. ఆర్మీని ఔట్ సోర్సింగ్ చేయాలనే ఉద్దేశంతోనే అగ్నిపథ్ను తీసుకొచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా అనేక మంది అగ్నిపథ్కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన విషయాన్ని మంత్రి తలసాని గుర్తు చేశారు. గతంలో పరేడ్ గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ సభ కోసం అనుమతి కోరితే రాజకీయ పార్టీల సభకు అనుమతించమని చెప్పారని, నేడు బీజేపీ సభకు ఎలా అనుమతి ఇచ్చారని మంత్రి తలసాని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్రెడ్డి, గజ్జెల నాగేశ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నాంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి ఆనంద్ గౌడ్, పద్మారావు నగర్ ఇన్చార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి క్యాంప్ ఆఫీస్, రాజ్భవన్ రోడ్ మీదుగా పీవీ మార్గ్కి చేరుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. హైదరాబాద్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బీజేపీ ముఖ్య మంత్రులు మూడు రోజుల పాటు నగరానికి వచ్చిన టూరిస్టులుగా అభివర్ణించారు. తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి తరిస్తారని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ శ్రీరామరక్ష అని, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.