106 కిలోల గంజాయి,4 కిలోల ఓపీఎం స్వాధీనం
సిటీబ్యూరో, జులై 1 (నమస్తే తెలంగాణ): వేర్వేరు ఘటనల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. సీపీ మహేశ్భగవత్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన ఓంప్రకాశ్ చందానగర్లో కిరాణా దుకాణాన్ని నడిపిస్తున్నాడు. రాజస్థాన్కు చెందన గిరిధర్ వద్ద కిలో రూ. 1.3 లక్షల చొప్పున 4 కిలోల ఓపీఎం కొనుగోలు చేశాడు. బస్సులో నగరానికి వచ్చి.. వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా, విశ్వసనీయ సమాచారంతో శుక్రవారం ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అతడిని పట్టుకున్నారు. మరో కేసులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మక్కకృష్ణ తుక్కు వ్యాపారి. అతడికి ఒడిశాకు చెందిన రాము గురువారం 106 కేజీల గంజాయిని 49 ప్యాకెట్లలో ప్యాక్ చేసి.. భువనగిరి ప్రాంతంలో ఇచ్చిరావాలంటూ కృష్ణను పురమాయించాడు. ఆటో ట్రాలీలో సరుకును తీసుకొని.. కృష్ణ నగరానికి వస్తుండగా, రాయగిరి క్రాస్ రోడ్ వద్ద ఎల్బీనగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం, భువనగిరి పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. సరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు రాము పరారీలో ఉన్నాడు.