సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ): విమాన టికెట్ చార్జీలను రీఫండ్ చేయాలని ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్కు కన్జ్యూమర్ కమిషన్-1 అధ్యక్షురాలు బి. ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి. లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. బేగంపేటకు చెందిన కేఎస్వీఎల్ నరసింహమూర్తితో పాటు ఆయన కుటుంబసభ్యులు నలుగురు హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్లేందుకు ఇండిగో ఫ్లైట్ కోసం విమాన టికెట్లను ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ద్వారా 2016లో బుక్ చేసుకున్నారు. ఉదయం 5.55గంటలకు విమానాశ్రయానికి చేరుకొని బోర్డింగ్ పాసులు కూడా పొందారు. ప్రయాణికుల్లో ఇద్దరు జువైనల్ డయాబెటిక్ కావడంతో వారికి టిఫిన్ చేయించి 6.45గంటలకు సంబంధిత గేట్ దగ్గరకు వెళ్లారు.
సిబ్బంది సూచన మేరకు వేరే గేటు నుంచి వెళ్లగా, అప్పటికే ఫ్లైట్ వెళ్లిపోయింది. పైగా ఇండిగో అధికారులు మరో ఫ్లైట్లో కొచ్చికి వెళ్లాలని, కానీ ఒక్కసీటు మాత్రమే ఉందని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో స్పైస్ జెట్లో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని కొచ్చి చేరుకున్నారు. మళ్లీ ఇండిగో అధికారులను సంప్రదించి, వివరాలు అడగ్గా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో ప్రయాణికులు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్.. రూ.19,766లు రీఫండ్ చేయాలని, రూ.25వేలు వేదనకు గురైనందుకు, రూ.15వేలు లీగల్ ఖర్చుల కింద బాధితులకు చెల్లించాలని ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ను ఆదేశించింది. 45రోజుల్లో ఆదేశాలు పాటించాలని స్పష్టం చేసింది.