సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ ) : అనారోగ్యాన్ని దూరం చేసి.. ఆరోగ్యాన్ని దగ్గర చేసేదే నడక. జ్వరం నుంచి పక్షవాతం వరకు సకల రోగాలకు సంజీవనిగా నిలుస్తున్నది. అంత గొప్ప మేలు చేసే ఆ నడకకు వర్క్ బిజీలో కొందరు, బద్ధకంతో మరికొందరు దూరమవుతున్నారు. కానీ ఆ నడక లేకపోతే అనేక వ్యాధులు పొంచి ఉన్నాయనే విషయాన్ని ఆదమరుస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే ఎంతటి బిజీ షెడ్యూల్ ఉన్నా..వాకింగ్ మాత్రం చేయాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.
నడకతో లాభాలు..
నడకతో కేలరీలు ఖర్చేగాని డబ్బు ఖర్చు ఏమాత్రం ఉండదు. జిమ్కి వెళ్లక్కర్లేదు. వ్యాయామ సామగ్రి అక్కర్లేదు. శిక్షణ అంత కంటే అవసరం లేదు. రోజూ నడవడం వల్ల గుండె నుంచి ఎముకల వరకు ఆరోగ్యం చేకూరుతుంది. వారంలో ఎన్ని ఎక్కువ రోజులు 30 నుంచి 60 నిమిషాల పాటు నడిస్తే గుండె ఆరోగ్యం అంత బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నడవడం వల్ల గుండె జబ్బుల అవకాశం తగ్గుతుందని పరిశోధనలు వెల్లడించాయి. అంతేకాకుండా వారంలో కేవలం రెండు గంటల పాటు నడిచినా.. పక్షవాతం వచ్చే అవకాశం 30 శాతం వరకు తగ్గించవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. వారం మొత్తంలో నాలుగు గంటలు నడిస్తే తుంటి ఎముక ఫ్రాక్చర్ల అవకాశాన్ని 42 శాతం తగ్గించవచ్చని అధ్యయనాలు తెలిపాయి.
ప్రతి రోజూ ఒక గంట నడిస్తే స్థూలకాయం వచ్చే అవకాశం సగానికి పడిపోతుంది. 3,500 అడుగుల నడక మధుమేహ అవకాశాన్ని 29 శాతం తగ్గిస్తుంది. అంటే దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గినట్టే.
మెదడు చురుకుగా..
నడక లేకపోతే మానసిక సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన ఆలోచనలు తీసుకోవడంలో విఫలమవుతారు. వారానికి మూడు సార్లు 40 నిమిషాల పాటు నడిస్తే మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. ఆలోచన పరిధి పెరుగుతుంది. డ్రిపెషన్ లక్షణాలు 36 శాతం తగ్గించవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు, షుగర్, బీపీలకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామంలో అత్యంత సులువైనది నడక. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎక్కువ కష్టం లేకుండా ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేదే నడక. ప్రతిరోజూ కొంతసేపు నడిస్తే.. ఆరోగ్యానికి ఢోకా ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా వాకింగ్ చేసే మేలు గొప్పది. శరీరంలో ప్రతి అవయవమూ వాకింగ్ వల్ల పునరుత్తేజం చెందుతుందని అనేక పరిశోధనలు రుజువు చేశాయి.
మెదడు పనితీరు మెరుగవుతుంది
ప్రతి ఒక్కరూ వాకింగ్ తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నడవడం వల్ల అనేక రోగాలను దూరం చేయొచ్చు. ముఖ్యంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్థూలకాయం, కొన్ని రకాల క్యాన్సర్లు, హృదయ సంబంధిత సమస్యలు, ఆందోళన, నిద్ర సమస్యలను నియంత్రించొచ్చు. రోజూ నడవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. వ్యాయామం అనేది చాలా కీలకం. రోజుకు 40 నిమిషాల పాటు నడవాలి. నడకతో ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది.
– డాక్టర్ పి. నవీన్ కుమార్,కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్
నడకతోనే ఆయుష్షు
నడకను ఈ కాలం యువత మరిచిపోయింది. ప్రతి పనికి బైక్, కారు మీద ఆధారపడుతోంది. మెట్లు కూడా దిగని స్థితికి వచ్చేశారు. లిఫ్ట్ట్లను విరివిగా వాడుతున్నారు. ఫలితంగా జబ్బులబారిన పడుతున్నారు. అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. కేవలం నడక వల్ల జీవితంలో ఎప్పటికీ అనారోగ్యం రాదు. రక్త ప్రసరణ సాఫీగా ఉంటుంది. మతి మరుపు ఉండదు. ఫిట్గానే ఉన్నాం కదా నడక ఎందుకు అని చాలా మంది అనుకుంటారు. అయితే నడక ప్రారంభించాల్సింది ఫిట్గా ఉన్నప్పుడే. నడవడం వల్లే పూర్వీకులు ఏ రోగాలు లేకుండా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారనే విషయం అందరూ తెలుసుకోవాలి.
– కె. రవికుమార్,రిటైర్డ్ ఇన్స్పెక్టర్, సీఆర్పీఎఫ్