చిక్కడపల్లి, జూన్ 29: నగర కేంద్ర గ్రంథాలయం పరిధిలోకి వచ్చే గ్రంథాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని నగర కేంద్ర గ్రంథాలయ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 8 కోట్లతో నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. బుధవారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో 33 గ్రంథాలయాల లైబ్రేరియన్స్, ఇన్చార్జి లైబ్రేరియన్స్తో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో కేంద్ర గ్రంథాలయం పరిధిలోకి వచ్చే 82 గ్రంథాలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయాలను గుర్తించి, వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.8 కోట్లతో 12 నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా.. రూ.2.11 కోట్లతో 33 గ్రంథాలయాల మరమ్మతు పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్ గ్రంథాలయాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటలోకి తెచ్చామని తెలిపారు. నగర కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి పద్మజ, సుకేశ్, వెంకటేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.