అబిడ్స్, జూన్ 28: అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో వారం రోజుల కిందట జరిగిన దారిదోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారివద్దనుంచి రూ.1.78 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ రవీందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, జానయ్యతో వివరాలు వెల్లడించారు. బజార్ఘాట్కు చెందిన బబ్లూ సంతోష్నగర్లో రాఘవేంద్ర పాన్షాపును లీజుకు తీసుకొని నడిపిస్తున్నాడు. కాగా, ఈ దోపిడీలో ప్రధాన నిందితుడైన హఫీజ్బాబానగర్కు చెందిన మహ్మద్ సిరాజ్ (22) ఈ షాపులో దినసరి వేతనంపై పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, షాపు యజమాని ఇటీవల రూ.ఐదు లక్షలకు ఓ వ్యక్తికి షాపును విక్రయించాడు. షాపు కొనుగోలు చేసిన వ్యక్తి తాను అడ్వాన్స్గా చెల్లించాల్సిన రూ. 1.90 లక్షలు ఈనెల 20న సిరాజ్కు ఇచ్చాడు.
ఆ డబ్బును బజార్ఘాట్లో ఉన్న షాపు యజమానికి ఇవ్వమని సూచించాడు. కాగా, ఈ పాన్ను కొనుగోలు చేయాలని చాలా కాలంగా సిరాజ్ వేచి చూస్తున్నాడు. అయితే, ఈ ఇతరులకు విక్రయించడంతో అతడు కోపం పెంచుకున్నాడు. డబ్బులు కొట్టేసేందుకు తన ముగ్గురు పాత నేరస్థులతో కలిసి పథకం వేశాడు. బజార్ఘాట్లోని యజమానికి డబ్బులను ఇచ్చేందుకు సంతోష్నగర్ నుంచి చాంద్రాయణగుట్టకు చెందిన పాత నేరస్థుడు సయ్యద్ నసీర్(21)తో కలిసి సిరాజ్ బయలుదేరాడు. వీరు బయలుదేరిన వివరాలను ఎప్పటికప్పుడు ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం ఎర్రకుంట ప్రాంతానికి చెందిన షేక్ హమ్దాన్ బిన్ సాలమ్(21), బార్కస్కు చెందిన అడ్నన్ బిన్ షఫీ(25)కి చేరవేశాడు. దీంతో వారిద్దరు రంగ్మహల్ వద్ద సిరాజ్ నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు.
కత్తితో బెదిరించి సెల్ఫో న్ లాక్కున్నారు. వారి వద్ద నుంచి రూ.1.90 లక్షలు దోచుకొని పారిపోయారు. ఈ దోపిడీ జరిగిన విషయాన్ని సిరాజ్ యజమానికి తెలిపాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అఫ్జల్గంజ్ దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలు, సెల్ఫోన్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. ఈ దోపిడీ సిరాజ్ వేసిన పథకంలో భాగంగానే జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. విచారంలో మిగతా నిందితులు బయటపడ్డారు. అందరిని పోలీసులు అరెస్టు చేశారు. తన కొనుగోలు చేయాల్సిన షాపును ఇతరులకు విక్రయించాడన్న కోపంతో సిరాజ్ దోపిడీ కథను రచించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును చేధించిన అఫ్జల్గంజ్ పోలీసులను డీసీపీ చక్రవర్తి, సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్ ప్రత్యేకంగా అభినందించారు.