ఖైరతాబాద్, జూన్ 27: లక్షలాది కండ్లకు ఆనందాన్ని పంచుతాడు.. ఆ మహా రూపాన్ని ఒక్కసారి దర్శించుకుంటే తన్మయత్వాన్ని అందిస్తాడు… మహాకాయుడై…. భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తూ…. ప్రతి ఏడాది విభిన్న ఆకృతుల్లో ఖైరతాబాద్లో కొలువుదీరే మహా గణపతి ఈ ఏడాది వైవిధ్యమైన రూపంలో రూపుదిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్ గణేశుడి ఆరు దశాబ్దాల చరిత్రలో మొట్టమొదటి సారిగా మట్టి ప్రతిమగా సాక్షాత్కరిస్తున్నాడు. లక్ష్మీ సమేతంగా.. ఏడు శేషుల పడగ నీడలో పంచముఖుడై దర్శనమివ్వనున్నాడు. ఈ మేరకు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి విగ్రహ నమూనాను సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు.
నూతన అధ్యయానికి నాంది..
1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన గణేశుడి చరిత్ర 60 అడుగుల ఎత్తు వరకు కొనసాగింది. గడిచిన 67 సంవత్సరాల్లో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ పీవోపీ గణపతిని విభిన్న రూపాల్లో ప్రతిష్టిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ద్వారా మట్టి గణపతుల విశిష్టతపై వివిధ రూపాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా, ఖైరతాబాద్లో మట్టి గణపతి ప్రతిమ ప్రతిష్టాపన నూతన అధ్యయనానికి నాంది పలుకనున్నది. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది 50 అడుగుల ఎత్తైన మట్టి గణపతిని ప్రతిష్టించాలని నిర్ణయించగా, ప్రభుత్వ సంకల్పానికి తొలి అడుగు పడినట్లయ్యింది.
50 అడుగుల ఎత్తు..22 అడుగుల వెడల్పు
67 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహా గణపతి పీవోపీ ద్వారా రూపుదిద్దుకుంటున్నాడు. ఈ ఏడాది మొట్ట మొదటిసారిగా మట్టితో శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతిని ప్రతిష్టిస్తున్నారు. 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో గణేడుడి ప్రతిమను తయారు చేస్తున్నారు. ప్రధానమైన విగ్రహానికి కుడివైపు 16 అడుగుల లక్ష్మి అమ్మవారు, ఎడమవైపు 12 అడుగుల మూషికాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా స్వామి వారికి రెండు వైపులా ఉప మండపాలను తయారు చేస్తున్నారు. 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపు శ్రీ త్రిశక్తి మహా గాయత్రి దేవిని ప్రతిష్టిస్తున్నారు.