సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): డిగ్రీ చదివిన యువకుడు ఉద్యోగం కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా, అతనికి అమ్మాయిలతో జల్సా చేసే లింక్ మెసేజ్ రూపంలో వచ్చింది. దానిని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లకు అడ్డంగా దొరికిపోయి, మోసపోయానని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాపూర్ ప్రాంతానికి చెందిన యువకుడు(25) బీ.ఏ. పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెబ్సైట్లను వెతుకగా, కొద్దిరోజులకు అతని ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో యువతులతో స్నేహం చేయడానికి సహాయం చేస్తామని.. వారితో ఒక రోజు కలిసి ఉండడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. వ్యక్తిగత వాట్సాప్నకు యువతుల ఫొటోలు పంపిస్తామని పేర్కొన్నారు. దీనికి యువకుడు ఆసక్తి చూపడంతో అతనికి పదుల సంఖ్యలో అమ్మాయిల ఫొటోలు పంపారు. హోటల్, ఆఫీసు, సర్వీసు చార్జీలకు ముందుగా రూ. 5 వేల పంపాలని చెప్పడంతో వారు సూచించిన ఖాతాలకు నగదును ఆన్లైన్లో పంపాడు. ఆ తర్వాత విడుతల వారీగా యువకుడి నుంచి రూ. 2.72 లక్షలు వసూలు చేశాడు. ఇక తన రిజిస్ట్రేషన్ను రద్దు చేసుకుంటానంటే క్యాన్సిలేషన్ కింద రూ. 98,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో యువకుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.