స్టార్టప్ రంగంలో మేటిగా దూసుకపోతున్న నగరంలో రెండోశకం ప్రారంభం కానుంది. ఈ రంగంలో సరికొత్త సంచలనం సృష్టించిన టీహబ్ ఎన్నో ఆవిష్కరణలకు వేదికైంది. సమస్య ఏదైనా సరికొత్త ఆవిష్కరణలతో పరిష్కారం చూపే నైపుణ్యం కలిగిన నిపుణులు ఈ వేదికగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఇదే ఒరవడితో టీహబ్-2 ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రూ.276 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో నిర్మించిన ఈ భవనాన్ని మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 5 రోడ్ల కూడలిలో నిర్మించిన ఈ భవనానికి సులువుగా వచ్చిపోయేలా రహదారులను
100,120అడుగుల వెడల్పుతో విస్తరించారు. సమీపంలో రాయదుర్గం మెట్రోస్టేషన్ ఉండడంతో రవాణా సులువుకానుంది. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు టీహబ్-2 ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.
సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : స్టార్టప్ రంగంలో సరికొత్త సంచలనం టీ హబ్. ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. సమస్య ఏదైనా … సరికొత్త ఆలోచనలతో పరిష్కారం చూపే నైపుణ్యం కలిగిన నిపుణులు టీ హబ్ వేదికగా ఎన్నో ఆవిష్కరణలు చేశారు. 8 ఏండ్ల కిందట ప్రారంభమైన టీ హబ్ ప్రస్థానం.. ఇక నుంచి విశ్వ వ్యాప్తం కానున్నది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్గా అవతరించనున్నది. ఐటీ రంగంలో హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందినట్లుగానే స్టార్టప్ రంగంలోనూ టీహబ్ ప్రారంభించిన నాటి నుంచే తన ప్రత్యేకతను చాటుకుంటూ దేశ, విదేశీ ప్రముఖులను ఆకట్టుకుంది. దేశంలోనే కాదు.. ఆసియా ఖండంలోనే అత్యుత్తమ స్టార్టప్ ఎకో సిస్టం కలిగిన ప్రాంతంగా నిలిచింది.
5 రోడ్ల కూడలిలో ఆకట్టుకునేలా టీ హబ్ నూతన భవనం
పనితీరులోనే కాదు.. భౌతికంగానూ హైదరాబాద్ ఐటీ కారిడార్లోనే ఎంతో ప్రత్యేకత కలిగిన భవనంగా టీ హబ్ 2.0 నిలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్మాణ శైలితో పాటు అత్యంత విశాలమైన 5 రోడ్ల కూడలిలో కొత్తగా రూపుదిద్దుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు రూ.276 కోట్లతో అత్యాధునిక డిజైన్తో సాండ్ విచ్ ఆకారంలో దీన్ని నిర్మించారు. టీ హబ్ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు. వీటిలో మొదటిది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా హోటల్ ఐటీసీ కోహినూర్ పక్కన నుంచి వచ్చే రోడ్డు, రెండవది..
మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఐకియా స్టోర్ ఎదురుగా ఉండే రోడ్డు, మూడవది రహేజే మైండ్ స్పేస్ ఎస్ఈజెడ్ నుంచి రాయదుర్గం బయోడైవర్సిటీ చౌరస్తాకు కలిసి రోడ్డు. నాల్గో రోడ్డు.. రాయదుర్గం- మాదాపూర్ వెళ్లే రోడ్డు నుంచి నాలెడ్జ్ సిటీని కలిపే రోడ్డు. రాయదుర్గం పోలీస్స్టేషన్ (పాత ముంబై హైవే)ను కలిపే రోడ్డు. ఇలా.. మొత్తం 5 విశాలమైన రోడ్లతో కూడలి ఉండటం దీని ప్రత్యేకత. నగరం నలుమూలల నుంచి ఏ మార్గంలో వచ్చినా టీ హబ్కు సులభంగా చేరుకునేలా రోడ్డు మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యాధునిక ప్రజా రవాణా సాధమైన మెట్రో రైలు మార్గంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నాలెడ్జ్ సిటీకి సమీపంలోనే ఉంది. అటు రోడ్డు మార్గం, ఇటు మెట్రో మార్గం ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రజా రవాణా పరంగా అత్యంత అనుకూలంగా మారింది.
టీ హబ్తో రాయదుర్గం నాలెడ్జ్ సిటీకి సరికొత్త సొబగులు
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఎన్నో ప్రాంతాలున్నాయి. మాదాపూర్ సైబర్ టవర్స్ కేంద్రంగా ప్రారంభమైన ఐటీ కంపెనీల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా వివిధ ప్రాంతాలకు విస్తరించింది. ప్రభుత్వ భూముల్లో ప్రత్యేకంగా ఎస్ఈజెడ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)లు, ప్రైవేటు భూముల్లోనూ అదే స్థాయిలో బహుళ అంతస్తుల వ్యాపార, వాణిజ్య భవనాలకు తోడు హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు వచ్చాయి. అందులో నాలెడ్జ్ సిటీ ఎంతో ప్రత్యేకమైంది. దుర్గం చెరువు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీ దేశ, విదేశీల ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రంగా మారింది.
ఈనెల 28న నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో నాలెడ్జ్ సిటీ ఎస్ఈజెడ్లోని రోడ్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ ప్రారంభోత్సవానికి సీఎం కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధునీకరణ పనులు చేపడుతుండటంతో ఈ ప్రాంతం సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. దేశ, విదేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు సైతం టీహబ్ 2.0 ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు.