సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ)/నాంపల్లి క్రిమినల్ కోర్టు: వివిధ కోర్టుల్లో ఆదివారం నిర్వహించిన లోక్అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టుల్లో మొత్తం 1518 సివిల్ కేసులు పరిష్కారమవ్వగా, వివిధ కేసులకు సంబంధించి బాధితులకు రూ.24 కోట్ల 71 లక్షల 81వేల నష్ట పరిహారం అందజేసేలా రాజీ కుదిరింది. సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ రేణుక యారా వివరాలు వెల్లడించారు. నగరంలోని సివిల్ కోర్టుల్లో మొత్తం పది బెంచీలు ఏర్పాటు చేసి లోక్ అదాలత్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. 324 మోటర్ ప్రమాదం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులను కూడా పరిషరించి బాధితులకు రూ.21 కోట్ల నష్టపరిహారాన్ని అందజేసే విధంగా రాజీ మార్గంలో కేసుల పరిషారం జరిగినట్లు వివరించారు. పర్మినెంట్ లోక్ అదాలత్లో ప్రజా సేవల రంగంలోని ప్రీ లిటిగేషన్ కేసులు, ఎస్బీఐ బ్యాంక్ కేసులు 1092కు పైగా పరిషరించినట్టు తెలిపారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్ వివరాలు వెల్లడిస్తూ.. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ న్యాయస్థానాల్లోని లోక్ అదాలత్ బెంచీలకు చీఫ్ జడ్జి రేణుక యారా, సిటీ స్మాల్ కాస్ కోర్టు చీఫ్ జడ్జి నిర్మల గీతాంబ, రెండో అదనపు చీఫ్ జడ్జి కె.ప్రభాకర్రావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ, సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్కుమార్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో అదనపు చీఫ్ జడ్జి జీవన్కుమార్ నేతృత్వం వహించినట్లు తెలిపారు. కేసుల సత్వర పరిషారం కోసం లోక్ అదాలత్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో సివిల్ కోర్టులకు వచ్చిన కక్షిదారులకు న్యాయ సేవాధికార సంస్థ తాగునీరు, ఆహార పొట్లాలు అందించినట్లు న్యాయమూర్తి కె. మురళీమోహన్ వివరించారు.
ఒకటైన కుటుంబాలు..
లోకల్ రాజ్ ఈ (e) పద్ధతిని ప్రోత్సహిస్తూ నిర్వహించిన ఈ జాతీయ లోక్ అదాలత్లో విడిపోయే పలు జంటలు, వివాదాల్లో చికుకున్న కుటుంబాలను న్యాయమూర్తుల చొరవతో రాజీ కుదిర్చి వారిని ఒకటి చేశారు. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో విడిపోయిన ఒక జంటను అదనపు జిల్లా న్యాయమూర్తి జీవన్కుమార్ లోక్అదాలత్ సాక్షిగా కలిపి ఇంటికి పంపించారు. తల్లిదండ్రుల బాధ్యత విషయంలో దత్త కుమారుడు, సొంత పిల్లలకు మధ్య జరిగిన ఓ కుటుంబ వివాదాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో కౌన్సెలింగ్ నిర్వహించి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి మురళీమోహన్ ఆ కుటుంబాన్ని కలిపారు. దత్త కుమారుడికి, కోడలికి మనవరాళ్లకు ప్రేమాభిమానాలతో తల్లిదండ్రులు కొంత ఆస్తితో పాటు నగదును అప్పగించారు.
పిల్లలందరూ న్యాయమూర్తి ఉమాదేవి సమక్షంలో మాట ఇచ్చి కుటుంబ వివాదాన్ని పరిషరించుకున్నారు. కాగా,. మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్-సెషన్స్ జడ్జి పాపిరెడ్డి ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 24 బెంచీలు ఏర్పాటు చేశామని, 3,55,727 కేసులు పరిష్కారమైనట్లు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో లోక్అదాలత్ను ప్రారంభించగా, మొత్తం 1,76,557 కేసులను పరిష్కరించినట్టు న్యాయసేవా సంస్థ కార్యదర్శి శ్రీదేవి తెలిపారు.
రైల్వే కోర్టులో..
బోయిగూడలోని రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఫర్ రైల్వేస్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. 1408 కేసులను పరిష్కరించారు.