చాంద్రాయణగుట్ట, జూన్ 26: ప్రేమించిన బాలికతో పెండ్లికి ఒప్పుకోవడం లేదని ఓ యువకుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైమ్ ఇన్స్పెక్టర్ కేఎస్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…మైలార్దేవ్పల్లికి చెందిన మహ్మద్ జమాల్ (21) అచ్చిరెడ్డినగర్లో నివాసముండే టైలర్ మోహసిన్ వద్ద కొన్నాళ్లు పని చేసి మానేశాడు. మోహసిన్ కుమార్తెను (16)ని ప్రేమించిన జమాల్.. ‘నీ కూతురు.. నేను ప్రేమించుకున్నాం. మాకు పెండ్లి చేయండి’ అంటూ.. ఆమె తల్లిదండ్రులను కోరగా, వారు నిరాకరించారు. అయితే వివాహం చేయకపోతే తాను చనిపోతానని బెదిరించడంతో శనివారం జమాల్ సోదరుడికి విషయం చెప్పారు.
అతడు అచ్చిరెడ్డినగర్కు వచ్చి బాలిక తండ్రితో మాట్లాడుతుండగానే జమాల్ డీజిల్ డబ్బాతో అక్కడి వచ్చాడు. ‘నీ కూతురిని ఇచ్చి పెండ్లి చేస్తావా.. లేదా’ అంటూ…ఆవేశంలో డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. షాక్కు గురైన బాలిక తండ్రి తలుపులు మూసుకోవడంతో రెండో అంతస్తులో ఉన్న జమాల్ మంటలు తాళలేక కిందకు దూకేశాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని పోలీసులు ఉస్మానియాకు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.