అమీర్పేట్, జూన్ 26 : యువకుడి నిర్లక్ష్య డ్రైవింగ్కు ఓ పసికందు బలైంది. అప్పటి వరకు కండ్లముందు బుడిబుడి అడుగులు, చిట్టిపొట్టి మాటలతో అల్లరి చేసిన చిన్నారి విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఆదివారం సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింకలవాడలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. జింకలవాడ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నివాసముంటున్న పొట్టేలు అఖిల్ దంపతుల కుమార్తె మోక్షిక (14 నెలలు) ఆదివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్నది.
ఈ క్రమంలో ఏపీ13పి 5726 నంబరు గల ఐ10 కారు వచ్చి ఆగింది. కారులో నుంచి ముగ్గురు యువకులు దిగి వెళ్లి పోయారు. అంతలోనే మహ్మద్ రసూల్ వచ్చి కారును స్టార్ట్ చేశాడు. అయితే కారు ముందు చిన్నారి మోక్షిక ఆడుకుంటున్న విషయాన్ని గమనించని రసూల్ కారును ముందుకు కదిలించాడు. దీంతో చిన్నారిపై నుంచి కారు దూసుకువెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్నది. గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం నీలోఫర్ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన రసూల్ పోలీసుల అదుపులో ఉన్నాడు.