కందుకూరు, జూన్ 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతతో కొత్తగూడ గ్రామ రూపురేఖలు మారి పోయాయి. ప్రగతి పథంలో కొనసాగుతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే గ్రామంలో వంద శాతం అభివద్ధి పనులు పూర్తయ్యాయి. పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేశారు. రోజు పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి, డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇంటింటికీ మరుగు దొడ్డి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడంతో పాటు స్వచ్ఛతకు మారు పేరుగా నిలిచింది. నర్సరీలో భారీగా మొక్కలు పెంచుతున్నారు. హరితహారం మొక్కలు సంరక్షించడంతో గ్రామంలో పచ్చదనం పెంపొందుతున్నది.
మండల కేంద్రానికి ఆనుకొని ఉండటంతో పంచాయతీ పరిధిలోని శ్రీశైలం, హైదరాబాద్, జాతీయ రహదారిపై సెంట్రల్ లైంటిగ్, ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్లతో అందం ఉట్టి పడుతున్నది. గ్రామస్తులు పాలకవర్గ మండలితో కలిసి సర్పంచ్ సాధ మల్లారెడ్డి పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పాత ఇండ్లును కూల్చి వేశారు. పాడు బడిన బావులు పూడ్చారు. పంచాయతీ అవసరాలకు కొత్త ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ మధ్యన హరిత హారం మొక్కలు నాటి, వాటిని సంరక్షింస్తున్నారు. వైకుంఠ ధామంలో శ్మశాన వాటికలు, స్నానాల గదులు, మురుగు దొడ్లు నిర్మించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి పనులు సాగుతుండటంతో గ్రామ ఆదర్శంగా నిలిచిపోయింది.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
గ్రామస్తులు, పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా. విద్యుత్, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, మంకీ కోర్టు ఏర్పాటు, వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, గ్రామాన్ని మండలంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.
– సాధ మల్లారెడ్డి, సర్పంచ్ కొత్తగూడ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి
అభివృద్ధి చేసేందుకు కృషి..
గ్రామంలో సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. గ్రామంలో రోజు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నాం. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలి. సమస్య వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకవస్తే వెంటనే పరిష్కరిస్తాం.
– శివశంకర్, పంచాయతీ కార్యదర్శి