బడంగ్పేట, జూన్ 26: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లి రంగనాయకుల కాలనీలో రూ.1.4కోట్లతో సీసీ రోడ్డు, వరద నీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ యాతం పవన్ యాదవ్తో కలిసి వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలకు సొంత ఇంటి కళ నెరవేర్చడానికి పొజీషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందన్నారు. 58, 59 జీవో ద్వారా సీఎం కేసీఆర్ సహకారంతో రెగ్యులరైజ్ చేయించామన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో డబుల్ బెడ్ రూమ్లు నిర్మాణం చేయిస్తున్నామన్నారు. అర్హులైన పేద వారికి ఇండ్లు ఇస్తామన్నారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ప్రతి ఇంటికీ తాగునీరు
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామన్నారు. కొత్తగా పైపులైన్లు, రిజర్వాయర్లు నిర్మాణం చేయించడానికి ప్రభుత్వం రూ.1200 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పది బస్తీ దవాఖానలు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పది బస్తీ దవాఖానలు మంజూరైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పట్టణ ప్రాంతాల్లో 21 బస్తీ దవాఖానలు మంజూరు చేస్తే అందులో పది బస్తీ దవాఖానలు బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు కేటాయించడం జరిగిందన్నారు. మరో ఐదు బస్తీ దవాఖానలు కావాలని ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. బస్తీ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగానే చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి, కార్పొరేటర్లు శివకుమార్, సూర్ణగంటి అర్జున్, పెద్దబావి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామిడి రాంరెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్రెడ్డి, పెద్దబావి ఆనంద్రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, నరేందర్గౌడ్, జనిగ శ్రీనివాస్ యాదవ్, పుట్టగల్ల సంతోష్, సిల్వేరు సాంబశివ, అధికారులు జ్యోతి, యాదగిరి, రాం ప్రసాద్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఉన్నారు.
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందుకూరు, జూన్ 26 : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దావుద్గూడ పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ భవనంతో పాటు రూ.10లక్షలతో సీసీ రోడ్డును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో.. గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దావుద్గడకు చెందిన పలువురు గిరిజనులు, పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకకర్తలు పాల్గొన్నారు.
అవ్వా.. పింఛన్ వస్తుందా..?
ఆప్యాయంగా పలకరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట, జూన్ 26 : రంగనాయకుల కాలనీలో పాదయాత్రలో భాగంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి ముసలవ్వను ఆప్యాయంగా పలుకరించారు. అవ్వా.. పింఛన్ వస్తుందా.. అని అడుగగా.. నా బిడ్డ కేసీఆర్ దయవల్ల వస్తుందని, ఆయన చల్లగా ఉండాలని దీవెనలు అందించింది. మంచిచేసిన వారిని ఎప్పుడూ మర్చిపోమని, మీరు మా గుండెలో ఉంటారని వృద్ధురాలితోపాటు కాలనీ వాసులు సైతం చెప్పారు. గులాబీ జెండా ఎప్పుడు మా గుండెల్లో ఉంటుందని పేర్కొనడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.