సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్ పెరుగుతున్న దృష్ట్యా ప్రమాదాలు జరగకుండా, సురక్షిత ప్రయాణం కోసం జీహెచ్ఎంసీ ట్రాఫిక్ సిగ్నల్స్ను ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్నది. నగర వ్యాప్తంగా అడాప్టెడ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ (ఏటీఎస్సీ) సిస్టమ్ ద్వారా పాదచారుల ప్రమాదాల నివారణకు పెలికాన్ సిస్టమ్ ద్వారా సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. కారిడార్లో ఉన్న సిగ్నల్స్ను కేంద్రీకృతంగా నియంత్రించడం, ట్రాఫిక్కు అనుగుణంగా సిగ్నల్ టైమింగ్ మార్చుకునే వెసులుబాటు, ట్రాఫిక్ను కెమెరాలో రికార్డు చేసే సెన్సార్ ఏర్పాటు, పవర్ బ్యాక్ అప్ కోసం సోలార్, బ్యాటరీ ఏర్పాటు, మెరుగైన ప్రయాణం, తకువ సమయం వెయిటింగ్ చేయడం, సిగ్నల్స్ వ్యవస్థతో రోడ్డు భద్రతా పెరుగుదల నగర ప్రజలకు సురక్షిత ప్రయాణానికి కృషి చేస్తున్నది.
384 సిగ్నల్స్ ఏర్పాటే లక్ష్యంగా..
జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ పద్ధతుల ద్వారా మొత్తం 384 సిగ్నల్స్ ఏర్పాటు లక్ష్యం కాగా, అందులో హెచ్ ట్రీమ్స్ ద్వారా 234, ఏటీఎస్సీ పద్ధతి ద్వారా 150 ఏర్పాటుకు ప్రతిపాదించగా, వివిధ కారణలైన యూ టర్న్, ఫె్లై ఓవర్లు, సైట్ ఫెసిబిలిటి లేకపోవడంతో 50 సిగ్నల్స్ను తొలగించారు. మిగతా 334లలో హెచ్ ట్రీమ్స్ 212, ఏటీఎస్సీ 122 ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందులో ప్రస్తుతం 199 హెచ్ ట్రీమ్స్ 73, ఏటీఎస్సీ ద్వారా మొత్తం 179 సిగ్నళ్ల ఏర్పాటును అందుబాటులోకి తెచ్చారు. ఇంకా 44 సిగ్నల్స్ ప్రగతి దశలో ఉన్నాయి. మరో 18 లొకేషన్లను నిర్ణయించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న సిగ్నల్ ఏర్పాటు పూర్తయితే హెచ్ ట్రీమ్స్ సిస్టమ్తో 212 సిగ్నల్స్, ఏటీఎస్సీ సిస్టమ్తో 122 నగరంలో మొత్తం 334 సిగ్నల్స్ ఏర్పాటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
పోల్ మారింగ్ లొకేషన్ గుర్తింపుతో..
పోలీస్ శాఖ అధికారులు పోల్ మారింగ్ లొకేషన్ గుర్తింపు చేసి జీహెచ్ఎంసీకి సిఫార్సు చేస్తారు. వారి సూచన, ప్రతిపాదన మేరకు జీహెచ్ఎంసీ సిగ్నల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడాప్టెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా 96 సిగ్నల్స్, పెలికాన్ సిస్టమ్ ద్వారా మరో 70 ఏర్పాటుకు ప్రతిపాదించారు. సిగ్నల్స్ ఏర్పాటులో పోలీస్ శాఖ సూచించిన మేరకు ఫెసిబిలిటినీ బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయుటకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.