బడంగ్పేట, ఫిబ్రవరి 4: ప్రభుత్వ సంకల్పానికి దాతలు చేయూతనిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. ఒకప్పుడు బాలాపూర్ మండలం గుర్రంగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరైన సౌకర్యాలు, వసతులు ఉండేవి కావు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకురావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గుర్రంగూడకు చెందిన ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్, డైరెక్టర్ అశోక్ గుర్రంగూడ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. రూ.13 లక్షలతో పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించారు. దీంతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. నేడు విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కార్పొరేటర్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతులు..
శిథిలావస్థలో ఉన్న పాఠశాలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారు. పాడై పోయిన కిటికీలు, తలుపులు, బెంచీలు కొత్తవి ఏర్పాటు చేశారు. టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, లైట్స్ అమర్చారు. వాటర్ ట్యాంక్ను నిర్మించారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు. తరగతి గదులకు వాల్ పెయింటింగ్, గోడలపై సూక్తులు రాయించారు. కళా వేదికలు ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధాన ముఖ ద్వారం బోర్డును ఏర్పాటు చేశారు. మూత్రశాలలు, మరుగు దొడ్లు నిర్మించారు.
సౌకర్యాలతో విద్యార్థుల సంఖ్య పెరిగింది: జ్యోతి, ప్రధానోపాధ్యాయురాలు
గుర్రంగూడ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపడటంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. మన ఊరు మన బడిలో భాగంగా పాఠశాల అభివృద్ధికి ఈఎల్వీ ఫౌండేషన్ పూర్తి స్థాయిలో సహకారం అందించింది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు పిల్లలకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చొరవ తీసుకుంటున్నాం.
సౌకర్యాలుంటేనే బాగా చదువు కుంటారు: అశోక్, ఈవీఎస్ ఫౌండేషన్ డైరెక్టర్
పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పిస్తే బాగా చదువుకుంటారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలను చూసిన తర్వాత బాగు చేయించాలనిపించింది. రూ.13లక్షలు ఖర్చుచేసి మరమ్మతులు చేయించాను. ప్రతినెల నిర్వహణ కోసం డబ్బులు ఇస్తున్నాను. విద్యార్థులకు దుస్తులు, బూట్లు ఇస్తున్నాను. ఆయాకు నెల వేతనం ఇస్తున్నాను. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశాను. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దాం.
దాతలు చేయూతనిస్తేనే అభివృద్ధి: ఎంఈవో కృష్ణయ్య
పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొస్తే పాఠశాలలు మరింత మెరుగుపడుతాయి. సౌకర్యాలు కల్పిస్తే ఉపాధ్యాయులు కూడా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. గుర్రంగూడ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఈఎల్వీ ఫౌండేషన్ వారి సేవలు గొప్పవి. బాలాపూర్ మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరిస్తున్నారు.