మియాపూర్ , జూన్ 22;వినాయక నవరాత్రోత్సవాలు సమీపిస్తున్న వేళ ఈ సారి పూర్తి స్థాయిలో మట్టి వినాయక ప్రతిమలనే పూజలకు వినియోగించేలా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ మేరకు ప్రజలలో విస్తృతమైన చైతన్యం నింపే చర్యలకు ముందుస్తుగా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వినాయక విగ్రహాల తయారీదారులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అధికారులు పొదుపు సంఘాలు తయారీలో కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తున్నారు.
ఈ సారి వినాయక ఉత్సవాలకు పూర్తి స్థాయిలో మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించేలా విస్తృతమైన ప్రచారాన్ని చేపడుతున్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్ , యూసుఫ్గూడ, ఆర్సీపూర్ సర్కిళ్ల పరిధిలోని ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఇప్పటికే భారీ మట్టి గణపతి ప్రతిమలను ప్రదర్శిస్తున్నారు. సర్కిల్కు నాలుగైదు ప్రధాన ప్రాంతాల చొప్పున జోన్ వ్యాప్తంగా 20కి పైగా ప్రాంతాలలో మట్టి ప్రతిమలను ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆసక్తితో తిలకిస్తున్నారు. అలాగే మట్టి వినాయక ప్రతిమల విగ్రహాల సందర్శనకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను నేటి నుంచి అధికారులే స్వయంగా తీసుకెళ్లనున్నారు. అక్కడికక్కడే మట్టి ప్రతిమల బుకింగ్లు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై ప్రజలలో విస్తృత అవగాహన కోసం ఈ నెల 17 నుంచి బల్దియా ప్రచారం షెడ్యూల్ ప్రారంభించింది. దేవాలయాలు, ట్రాన్స్ పోర్టు హబ్లు, టూరిస్ట్ స్థలాల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు నిమజ్జనానికి చెరువులు కలుషితం కాకుండా ప్రత్యేకంగా బేబీ పాండ్స్, లేక్ల సమీపంలో రబ్బర్ పాండ్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మట్టి వినాయక ప్రతిమల తయారీదారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బహుమతులను అందించనున్నారు.
వంద శాతం మట్టి విగ్రహాలే..
ఈ సారి వినాయక నవరాత్రోత్సవాలకు జోన్ వ్యాప్తంగా వంద శాతం మట్టి ప్రతిమలనే వినియోగించేలా ప్రజలలో చైతన్యం కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే తయారీదారులతో పలు దఫాలుగా సమావేశాలను నిర్వహించాం. తయారీ దారులకు తమ పరంగా పూర్తి తోడ్పాటుతో పాటు బ్యాంకు రుణ వసతిని కల్పించనున్నాం. పీవోపీలకు బదులు మట్టి ప్రతిమలు తయారు చేసే వారికి ప్రత్యేకంగా ఇన్సెంటివ్లను అందిస్తాం. పొదుపు సంఘాల మహిళలకు విగ్రహాల తయారీపై శిక్షణను అందిస్తున్నాం. ప్రజలు పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరుతున్నాం.
– శంకరయ్య, జడ్సీ, శేరిలింగంపల్లి జోన్
మట్టిలో రాయితీ..!
పీవోపీ తయారీదారులు కూడా మట్టి ప్రతిమలనే తయారు చేసేలా జోన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీకి అవసరమైన చెరువు మట్టిని అతి తక్కువ ధరకు అందించే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే తయారు చేసి ఉన్న పీవోపీ విగ్రహాలకు తయారీదారులు వెచ్చించిన వ్యయాన్ని కూడా నష్టపరిహారంగా అందించాలని భావిస్తున్నట్లు సమాచారం.