సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ):జామ్తారా సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. జామ్తారాపై పోలీసుల నిఘా పెంచడంతో తమ అడ్డాలను ఇతర రాష్ర్టాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. జామ్తారా ప్రాంతానికి చెందిన సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తూ ఫోన్లు మాత్రం కొత్త అడ్డాల నుంచి చేస్తున్నారు. హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు 13మంది జామ్తారా సైబర్ నేరగాళ్లను ఇటీవల పీటీ వారెంట్పై ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తరలించారు. కోర్టు అనుమతితో 12 మందిని సోమవారం, దీరాజ్ అనే మరో నిందితుడిని మంగళవారం కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో నిందితులు పలు విషయాలను వెల్లడించారు.
నెలవారి జీతాలకు..
జామ్తారాలో సైబర్నేరాల్లో ఆరితేరిన ప్రధాన నేరగాళ్లు తమ అడ్డాలను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని స్థానికంగా నేరాలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. తక్కువ జీతాలకు పనిచేసే యువతను దగ్గరకు తీసి, సైబర్నేరాలు ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల జీతంకు పనిచేసే వారిని ఎంపిక చేసుకొని, వాళ్లకు రూ.12 నుంచి రూ.15 వేల జీతం ఇస్తూ ముఠాలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ముఠాను ముందుగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్కు పంపించారు. దాదాపు 1800 కిలోమీటర్ల దూరానికి వాళ్లను తరలించి సూరత్లో అడ్డాలు ఏర్పాటు చేయించారు.
ఈ ముఠాకు రెండు ఇండ్లను ఏర్పాటు చేయించి ఒక్కోదాంట్లో 7మంది చొప్పున వారికి కేటాయించారు. వాళ్లకు కావాల్సిన ఫోన్ నంబర్లు, సిమ్కార్డులు, సెల్ఫోన్లు అన్నీ ప్రధాన సూత్రదారులు అప్పగించారు. ఒకరు మెసేజ్ పంపిస్తే.. మరొకరు ఫోన్లో మాట్లాడుతూ మినీ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఈ ముఠాను ఢిల్లీ పోలీసులు ఒక కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ గ్యాంగ్ చేసిన నేరాలను విశ్లేషిస్తున్న క్రమంలో హైదరాబాద్కు సంబంధించిన పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వెంటనే సిటీ సైబర్క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి వెళ్లి అక్కడి జైలు నుంచి నిందితులను పీటీ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు.
ఎస్బీఐ యూనో కస్టమర్లకే టోకరా
ఈ ముఠా ఎక్కువగా ఎస్బీఐ కస్టమర్లు, అందులో యూనో యాప్ ఉపయోగిస్తున్న వారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ప్రధాన నిందితులు రెండు, మూడు రోజుల కోసం డాటాను ఈ ముఠాకు అందిస్తుంటారు. ఆ డాటాలో ఉన్న ఫోన్ నంబర్లకు మీ కేవైసీ అప్డేట్ కాలేదు.., మీ ఖాతా క్లోజ్ అవుతుందంటూ మెసేజ్లు పంపిస్తూ వివరాల కోసం కింద ఒక లింక్ ఇస్తారు. బాధితులు ఆ మెసేజ్కు స్పందించి లింక్ క్లిక్ చేయగానే మీ ఖాతా వివరాలు చెప్పండంటూ ఓ ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడే సైబర్ నేరగాళ్లు యూనో యాప్ను బాధితులతో ఓపెన్ చేయిస్తూ, దాని యూజర్ ఐడీ, పాస్వర్డ్ను తస్కరిస్తున్నారు.
దీనికి ప్రత్యేక కోడ్ ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రిమోట్ యాప్లైన ఎనీడెస్క్, టీమీ వ్యూహర్ లాంటి యాప్ల ద్వారా బ్యాంక్ ఎండ్ పనిచేస్తున్న సమయంలో అన్ని వివరాలు సైబర్నేరగాళ్లు దోచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలాఉండగా ప్రస్తుతం పట్టుబడిన నిందితులకు ఆ లింక్ ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. దీనిపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.