బేగంపేట్, జూన్ 21 : అర్ధరాత్రి రోడ్డుపై సంచరిస్తూ ఒంటరిగా వెళ్తున్న వాహనదారులను టార్గెట్ చేసి దోచుకుంటున్న ఓ ముఠాను బేగంపేట్ పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ నరేశ్ రెడ్డి, సీఐ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు.బేగంపేట్, పాటిగడ్డ, ఎంబీటీ నగర్, ప్రకాశ్నగర్, మయూరిమార్గ్ ప్రాంతాలకు చెందిన పి.కృష్ణ(21) కొరియన్ బాయ్, బి.నరేశ్ (23) లేబర్, ఎ.చందు(20) టీ స్టాల్ నిర్వాహకుడు, డి.కిశోర్ (19) టీ స్టాల్ బాయ్, మహేశ్వర్దన్ (19) కార్మికుడు, భానుప్రకాశ్ (20) డ్రైవర్. వీరంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 20న (సోమవారం) ఆర్ధరాత్రి 1.10 గంటలకు బోరబండకు చెందిన ముంగులాలు శ్రీను తన స్నేహితులైన బాపన్ ప్రమాణిక్, బస్వంత్లతో కలిసి బేగంపేట్ శ్యాంలాల్ దనియాలగుట్ట శ్మశాన వాటిక మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తుతున్నారు. ఈ క్రమంలో వారిని ఆపి చుట్టుముట్టిన దుండగులు దాడి చేసి వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, నగదు లాక్కున్నారు. మరో ఘటనలో బేగంపేట్ లైఫ్ైస్టెల్, కట్టమైసమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న బ్రిడ్జిపై వెళ్తున్న ఓ డీసీఎంను ఆపి డ్రైవర్పై దాడిచేసి సెల్ఫోన్, నగదు లాక్కొని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బేగంపేట్ పోలీసులు 24 గంటల్లో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరందరికి గతంలో జరిగిన వివిధ నేరాల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.