మేడ్చల్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకం లబ్ధిదారులకు వ్యాపారాలు, ఇతర ఉపాధి కల్పనలపై శిక్షణలు అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలు ఆర్థిక స్వాలంబన సాధించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల ఏడో తేదీ నుంచి వ్యాపారాలు, ఇతర ఉపాధి కల్పనలపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో శిక్షణ తరగతులను నిర్వహించనుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి వంద మంది చొప్పున 5 వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపిక, లబ్ధిదారుల జాబితా ఆధారంగా నిర్వహించిన దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. దీంతో లబ్ధిదారులకు సంబంధించి బ్యాంకు ఖాతాలను తెరిపించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల ఐదో తేదీ వరకు బ్యాంకు ఖాతాలు తెరిచే పక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏజెన్సీల ద్వారా శిక్షణ..
లబ్ధిదారులకు వ్యాపారాలు, ఉపాధి కల్పనలపై ప్రత్యేక ఏజెన్సీల ద్వారా శిక్షణను అందించనున్నారు. లబ్ధిదారుల దరఖాస్తులలో వ్యాపారాలు, ఇతర ఉపాధి కల్పనలను ఏర్పాటు చేసుకున్న వివరాల ప్రకారం, అవసరం ఉన్న లబ్ధిదారులకు శిక్షణను అందించనున్నారు. దళిత బంధు పొందిన లబ్ధిదారులంతా ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు స్థాపించే వ్యాపారాలు, ఉపాధి కల్పనలో రాణించేలా శిక్షణ తరగతలు నిర్వహించనున్నారు. కాగా, దళిత బంధులో 30 రకాల వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు సూచనాత్మాక అభివృద్ధి పథకాల జాబితా రూపొందించన విషయం తెలిసిందే.
లబ్ధిదారులకు శిక్షణ తరగతులు
జిల్లాలో మొదటి దశలో దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల ఏడో తేదీ నుంచి వ్యాపారాలు, ఇతర ఉపాధి కల్పనలను ఏర్పాటు చేసుకునేందుకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నాం. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగా, ప్రస్తుతం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దళిత బంధు పథకం వల్ల లబ్ధిదారులకు రూ.10 లక్షలతో వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దళిత బంధు పథకం పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏజన్సీల ద్వారా శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా 500 మంది లబ్ధిదారులకు త్వరలోనే వారి ఖాతాలలో నగదు జమ కానుంది.
– శ్యాంసన్,అదనపు కలెక్టర్,మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా