కందుకూరు, జూన్ 19 : చిన్నతనం నుంచి నాకు మూగజీవాలంటే ఎంతో ప్రేమ మా నాన్న పోలీస్ ఆఫీసర్.. ఆయన మూగ జీవాల ప్రేమికుడు. ఆయనను చూసి కుక్కలతో పాటు ఇతర జంతువులు పక్షులు అంటే ఇష్టం ఏర్పడింది. కుటుంబ బాధ్యతలు తీరడంతో ఇక్కడ వచ్చి మూగ జీవాలకు సేవలు అందిస్తున్న. ప్రతి జీవిని ఆదరిస్తే ప్రకృతి సేవ చేసినట్టే. నా ప్రయత్నానికి కుంటుంబ సభ్యులు సహకారం అందిస్తున్నారు. మూగజీవాలకు సేవలు అందిస్తుండటం ఎంతో సంతృప్తినిస్తుంది.
ఏదైన జంతువో.. పక్షో గాయాపడి ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోకుండా వెళ్తుంటారు చాలా మంది. అందరిలా కాకుండా ఓ జంతు ప్రేమికుడు మాత్రం వాటిని ఆదరించి తన సొంత ఖర్చుతో చికిత్స చేస్తున్నాడు. వాటికి ఆహారం అందిస్తూ.. అవి కోలుకునే వరకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నాడు. నగరంలోని తార్నాకాకు చెందిన ప్రేమ్లాల్ మొదట యాడ్ టెలి ఫిల్మీ దూరదర్శన్లో పని చేసేవాడు. కాగా తన నలుగురు పిల్లలు.. వారంతా స్థిరపడ్డారు. తన భార్య హెచ్ఎంగా విధులు నిర్వహిస్తోంది.
దీంతో కుటుంబ బాధ్యతలు తీరడంతో.. చిన్నతనం నుంచే ఉన్న తన కోరికను తీర్చుకోవడానికి అన్నీ వదిలేసి 8ఏండ్లుగా కుంటుంబానికి దూరంగా ఉంటూ.. మూగజీవాల ఆలనపాలనే లోకంగా జీవిస్తున్నాడు. ఈ క్రమలో నాలుగేండ్ల క్రితం కందుకూరుకు మకాం మార్చి.. గాయాలపాలనై కుక్కలు, పిల్లులు, నెమళ్లు, ఇతరత్రా పక్షులకు చికిత్సలు అందిస్తూ.. వాటికి ఆహారం అందిస్తున్నాడు. కాగా గ్రామానికి దూరంగా కొంత స్థలం తీసుకొని అందులో గాయపడ్డ జంతువులను ఉంచుతున్నాడు. గాయాలైన వాటికి ప్రత్యేక పరికరాలను తయారు చేసి అమర్చి అవి నడిచేలా చేస్తున్నాడు.