తెలుగుయూనివర్సిటీ, జూన్ 15: తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో కళాశాలల్లో విద్యాప్రమాణాలు పెరిగాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. విజయనగర్ విద్యాసమితి ఆధ్వర్యంలో విజయనగర్ కళాశాల ఆఫ్ కామర్స్ 49వ వార్షికోత్సవం, క్రీడా దినోత్సవాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. యూజీసీ మాజీ సభ్యులు, విజయనగర్ విద్యాసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ జి. గోపాల్రెడ్డి అధ్యక్షోపన్యాసంలో మాట్లాడుతూ.. 1973లో స్థాపించిన విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ 50వ వసంతంలోకి అడుగుపెట్టిందని చెప్పారు.
నాణ్యమైన విద్య, జాతీయ సమగ్రత, కేరీయర్ ధోరణి, థృక్పథాల రూపకల్పనపై కళాశాల దృష్టి సారించిందని తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, న్యాక్ గుర్తింపు పొందిన కళాశాలలు ప్రభుత్వ తోడ్పాటుతోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ వి. ఉషాకిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆలోచనలో మార్పులు వస్తే కామర్స్ విద్యలో రాణించడం సులభమన్నారు. కళాశాల యాజమాన్య కమిటీ కార్యదర్శి ఎం. రాజమహేందర్రెడ్డి, కళాశాల గౌరవ కార్యదర్శి డాక్టర్ కె. గోపాల్, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ. రమణ మూర్తితో పాటు భోధన, భోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేదికపై ప్రదర్శించిన శాస్త్రీయ, సంప్రదాయ నృత్యాలు, ఆలపించిన సినీ గీతాలు ఆకట్టుకున్నాయి.
మెరిటోరియస్ పూర్వ విద్యార్థులకు సత్కారం..
కళాశాల పూర్వ విద్యార్థులు తెలుగువర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రెడ్డి శ్యామల, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ నళినీ పద్మావతి, డీఎస్పీ రాజగోపాల్, కామారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రమోహన్, సీనియర్ న్యాయవాది లక్ష్మారెడ్డి తదితరులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులలో అసాధారణ విద్యార్థిగా భారగ్వాదిత్య ఎంపికయ్యారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడని పలువురు విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.