మేడ్చల్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) ; ‘పిల్లలు, యువత శారీరక, మానసిక ఉల్లాసం కోసం ప్రభుత్వం ప్రతి గ్రామం, మున్సిపల్ కేంద్రంలో క్రీడా ప్రాంగణాలు నిర్మించాలని సంకల్పించింది. కావాల్సిన నిధులను మంజూరు చేసి అందుబాటులోకి తెస్తాం. వినియోగించుకునే బాధ్యత పౌరులదే. అదనంగా నిధులు అవసరమైతే మంజూరు చేస్తాం. ఈ ప్రాంగణాల్లో వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్, ఇండోర్ స్టేడియంలు నిర్మిస్తాం. సిరిసిల్లలో మాదిరి మేడ్చల్లో స్టేడియం నిర్మాణానికి అదనపు నిధులు ఇస్తాం. దీని స్ఫూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ క్రీడా ప్రాంగణాలు తయారు కావాలి. నగరానికి ఆనుకొని ఉన్న మేడ్చల్ జిల్లాను అగ్రభాగాన నిలుపుతాం’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మేడ్చల్ పట్టణంలో రూ.1.80 కోట్ల వ్యయంతో 8 ఎకరాల్లో నిర్మించిన మినీ స్టేడియాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. –
పిల్లలు చదువుతోపాటు ఆటలపై దృష్టి సారించాలని, కరోనా వల్ల రెండేండ్లపాటు ఆటలకు దూరమయ్యారని, వారి కోసం గ్రామాలు, మున్సిపల్ కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మేడ్చల్లో 8 ఎకరాల విస్తీర్ణంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన మినీస్టేడియాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా స్టేడియాన్ని పరిశీలించి వసతులపై ఆరాతీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చిన్నారులు చదువుతోపాటు శారీరకంగా పనిచేస్తేనే హుషారుగా ఉంటారని, ఈ విషయాన్ని పీఈటీలు, పీడీలు దృష్టి సారించాలని సూచించారు.
మినీ స్టేడియంలో ఇండోర్ స్పోర్ట్స్, కాంప్లెక్స్ నిర్మాణం, సింథటిక్ ట్రాక్ నిర్మాణాలు చేపట్టాలని, దీనికి అవసరమైన రూ.2.50 కోట్లను కూడా కేటాయిస్తామని ప్రకటించారు. మంజూరు చేస్తున్న నిధులతో వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్ కోర్టులను కూడా నిర్మించాలన్నారు. సిరిసిల్లలో మినీ స్టేడి యం నిర్మాణానికి రూ.3 కోట్లు వెచ్చించామని, అలాగే మేడ్చల్ ఇండోర్ స్టేడియాన్ని తయారు చేయలని కలెక్టర్ హరీశ్కు సూచించారు. అన్ని మున్సిపాలిటీలు స్ఫూర్తి పొందేలా మేడ్చల్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని తీర్చిదిద్దాలని, తాను మళ్లీ వచ్చి సందర్శిస్తానని చెప్పారు. మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణంపై కమిషనర్లు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి
హైదరాబాద్కు అత్యంత చేరువలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా అభివృద్ధికి అడిగినన్ని నిధులు మంజూరు చేస్తున్నామని, జిల్లాను రాష్టంలోనే నంబర్.1 స్థానంలో ఉంచుతామని హామీఇచ్చారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ర్టాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రతి విద్యార్థికి మంచి విద్యనందించాలనే సంకల్పంతో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.
హరితహారంతోపాటు పల్లె, పట్టణ ప్రగతి ద్వారా రాష్ట్రం దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ హరీశ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నందారెడ్డి, మల్లారెడ్డి హెల్త్సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి, టీఆర్ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి పాల్గొన్నారు.