వనస్థలిపురం, జూన్ 14 : వనస్థలిపురం సుష్మా చౌరస్తా.. మంగళవారం ఉదయం 10.30నిమిషాల సమయంలో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హఠాత్తుగా ఓ కంటైనర్ లారీ రోడ్డుకు ఎడమ వైపు దూసుకువచ్చింది. అక్కడున్నవారంతా భయబ్రాంతులతో పరుగులు తీశారు. వేగంగా దూసుకువచ్చిన లారీ ముందు నుంచి వెళ్తున్న బైక్ను ఢీకొట్టి పై నుంచి దూసుకువెళ్లింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. నిమిషాల్లో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి.
మరో వ్యక్తికి గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. మూడు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అరుపులు, కేకలు.. ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయంనీడలోకి వెళ్లింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం. నల్గొండ పట్టణం లక్ష్మీనగర్లో నివాసముండే ముమ్మడి విజయలక్ష్మి(43) ప్రభుత్వ టీచర్. సోమవారం హయత్నగర్ రాఘవేంద్ర కాలనీలో ఉండే తన అన్న బోగోజు సురేశ్ కుమార్ ఇంటికి వచ్చింది. తన హౌసింగ్ లోన్ విషయమై అమీర్పేట్లోని ఎల్ఐసీ ఆఫీస్కు వెళ్లాలని అన్నతో చెప్పింది.
మంగళవారం ఉదయం 10.30గంటల సమయంలో అన్నా చెల్లెలు ఇద్దరూ బైకుపై బయలుదేరారు. ఆటోనగర్ దాటి సుష్మా చౌరస్తా నుంచి వెళ్తున్నారు. ఇంతలోనే వెనుక నుంచి దూసుకువచ్చిన పాల కంటైనర్ లారీ వారి వాహనాన్ని ఢీకొట్టి, వారిపై నుంచి దూసుకువెళ్లింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న సురేశ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న విజయలక్ష్మిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మరో వాహనదారుడు మురళీ మోహన్ స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి కారణమైన పాల లారీ హయత్నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్నది. సుష్మా చౌరస్తా వద్దకు రాగానే లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ముందు పదుల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఆందోళనకు గురైన డ్రైవర్ లారీని ఎడమ వైపునకు మళ్లించాడు. దీంతో బైక్ను ఢీకొట్టిన లారీ.. అదే వేగంతో దూసుకువెళ్లి అక్కడున్న పాన్ డబ్బా, మూడు వాహనాలను ధ్వంసం చేసి భవనానికి ఢీ కొట్టి ంది. బ్రేకులు ఫెయిల్ అయిన వాహనం రహదారిపై నేరుగా ముందుకువెళ్లి ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా జరిగేదని, పెను ప్రమా దం తప్పిపోయిందని స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద మృతుల బంధువుల రోధనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.