సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): భూతాపం పెరుగుతోంది. భానుడి భగభగలతో భూమి నిప్పుల కుంపటిలా మారుతున్నది. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటున్నది. ఫలితంగా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అకాల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తున్నాయి. ఈ పరిస్థితులన్నింటికీ వేరే ఎవరినో నిందించాల్సిన పని లేదు. భూమిపై సమస్త జీవకోటికి అత్యంత హాని చేస్తున్నది అన్ని జీవరాసుల్లోకెల్లా మానవులే. అభివృద్ధితో సమానంగా జల, వాయు కాలుష్యం కూడా పెరుగుతున్నది. ప్లాస్టిక్ వ్యర్థాల భూతం నేలతల్లికి భారంగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో మనం మేల్కొనాల్సిన ఆవశ్యకత ఉన్నది. లేదంటే మానవ మనుగడకే ముప్పు ఏర్పడవచ్చని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను ముందే పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగానే హరితహారం, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారు. మిషన్ కాకతీయతో చెరువుల సుందరీకరణతో పాటు ఎస్ఎన్డీపీ వంటి కార్యక్రమాలతో నగరంలో నాలాలను విస్తరిస్తున్నారు. చెరువుల్లోకి కాలుష్య జలాలు వెళ్లకుండా చర్యలు చేపడుతూనే జలాల శుద్ధీకరణకు ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎనిమిదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని రూపొందించి కోట్లాది మొకలు నాటింది. వాటి పెరుగుదలకు మొక్కవోని దీక్షతో చర్యలు తీసుకుంది. అంతేకాదు. గ్రేటర్ వ్యాప్తంగా అర్బన్ గ్రీనరీ డెవలప్మెంట్ కింద అనేక వనాలను అభివృద్ధి చేసింది. దీంతోపాటు నగర నలుమూలల్లో పర్యావరణ పరిరక్షణకు అనేక పార్కులను ఏర్పాటు చేసింది. ఈ చర్యలు తీసుకోవడం వల్ల వాయు కాలుష్యం తగ్గిందని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్కు ఉత్తమ అవార్డులు కూడా వచ్చాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 2016-17 సంవత్సరంలో 64లక్షల మొక్కలు, 2017-18లో 76లక్షలు, 2018-19లో 43లక్షలు, 2019-20లో 72లక్షలు నాటారు. 2020-21 సంవత్సరంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో మూడు కోట్ల మొక్కల లక్ష్యంలో ఇప్పటి 2కోట్ల 76లక్షల మొక్కలను నాటినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
ఇతర నగరాలకు మార్గదర్శకం..
గ్రేటర్లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, ఖాళీ స్థలాల్లో భారీస్థాయిలో మొక్కలు నాటినందుకు ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ 2020’ గుర్తింపు లభించింది. హైదరాబాద్ అర్బన్, కమ్యూనిటీ ఫారెస్ట్రీలో ఆదర్శవంతమైన నగరంగా ప్రపంచంలోనే పలు నగరాలకు మార్గదర్శకంగా నిలిచింది. గతంలో కన్నా పెద్ద సంఖ్యలో మొక్కలు, మినీ అడవుల ఏర్పాటు ద్వారా మరింత ఆరోగ్యకరమైన, నివాస్యయోగ్యమైన నగరంగా రూపొందించడం అభినందనీయమని అర్బన్ డే ఫౌండేషన్ అధ్యక్షుడు డాన్ లాంబే తన సందేశంలో పేర్కొనడం విశేషం.
కాలుష్యాన్ని తగ్గించాలంటే..
నేడు మొక్కలు నాటే కార్యక్రమం
ప్రపంచ పర్యావరణ దినోత్సవంతోపాటు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ 60వ జన్మదిన వేడుకల సందర్భంగా గోషామహల్ స్టేడియంలోని సీటీసీ లెర్నింగ్ సెంటర్లో ఆదివారం ఉదయం 11 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, అడిషనల్ డీజీ సంజయ్కుమార్ జైన్, అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ డీఎస్ చౌహాన్, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొననున్నారు.