దుండిగల్/కుత్బుల్లాపూర్,జనవరి28: కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఫీవర్ సర్వే ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే పూర్తి చేసుకొని జ్వర బాధితులకు ఇచ్చిన కిట్ల ద్వారా తేరుకొని ఉపశమనం పొందుతున్నారు. కాగా సర్వే చేసిన బృందం ఇంటింటా తమ ఫోన్నంబర్లు ఇవ్వడంతో జ్వరం వంటి లక్షణాలు ఉంటే తమను సంప్రదిస్తే వెనువెంటనే మందుల కిట్లను నేరుగా ఇంటికొచ్చి ఇస్తామని ప్రజలకు చెబుతున్నారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సగానికి చేరువలో ఇండ్లలో సర్వే పూర్తి చేసుకున్నారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 18 వార్డుల్లో 18 టీంల ద్వారా మొత్తం 54 మంది సిబ్బందితో 12759 ఇండ్లలో సర్వే పూర్తి చేశారు. ఈ సర్వే ద్వారా 389 మంది జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నారని, గుర్తించగా అందులో 119 మందికి ప్రభుత్వం జారీ చేసిన మందుల కిట్లను పంపిణీ చేశారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22 టీం సభ్యులు 22848 సర్వే చేపట్టారు. ఈ సర్వేలో442 మంది జ్వర బాధితులు ఉన్నారని తేలడంతో పాటు 442 మందికి కిట్లను పంపిణీ చేశారు. కొత్తగా ఫోన్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మరో 15 మందికి కిట్లను పంపిణీ చేశారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో.. 72,880 ఇండ్లు ఉండగా ఇప్పటి వరకు 26694 ఇండ్లు పూర్తి చేశారు. వీరిలో 504 మంది జ్వర బాధితులను గుర్తించారు. గాజులరామారం సర్కిల్ పరిధిలో 80567 ఇండ్లు ఉండగా ఇప్పటి వరకు 33615 ఇండ్లు సర్వే చేయగా వీరిలో 1238 మంది జ్వరబాధితులను గుర్తించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 69138 ఇండ్లు ఉండగా ఇప్పటి వరకు 59222 ఇండ్లు సర్వే చేయగా 997 మంది జ్వర బాధితులు ఉన్నట్లు ఇప్పటి వరకు చేసిన సర్వేలో తేలింది.