దుండిగల్/జగద్గిరిగుట్ట, మే 28: తెలుగు ప్రజల ఆత్మ గౌరవం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి అన్నారు. నిజాంపేట పరిధిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ఎన్టీఆర్ విశ్వ విఖ్యాత నటుడు, పరిపాలనా దక్షుడు, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయిన ఆదర్శప్రాయుడని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకొని నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్ కమాన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర రావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, బండి రమేశ్, మోత్కుపల్లి నర్సింహులు, తదితరులు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, పెద్ద ఎత్తున నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పాల్గొన్నారు.