ముషీరాబాద్, మే 28: అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళా వేదికలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం, నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, పేదల బతుకులు బాగు చేయడమే లక్ష్యంగా అనతి కాలంలోనే పార్టీని స్థాపించి, అధికార పగ్గాలు చేపట్టి రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా నడిపిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. నటనలోనూ, బడుగు బలహీన వర్గాల హితం కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలోనూ ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకొని తెలుగు ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమాఖ్య కన్వీనర్ పి.సాయిబాబా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ కోసరాజు, వికలాంగుల హక్కుల వేదిక నేత కొల్లి నాగేశ్వర్ రావు, బాలరాజ్ గౌడ్, విశ్వేశ్వర్ రావు, కళా జనార్ధన మూర్తి, రవీందర్, అన్నపూర్ణ పాల్గొన్నారు.