సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ)/బోడుప్పల్: వ్యవసాయరంగంలో ఉత్పాదకత పెంచుకొంటనే మార్కెట్ డిమాండ్ను తట్టుకొని నిలబడగలమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. చైనా లాంటి దేశాల్లో ఎకరాకు వంద క్వింటాళ్ల ధాన్యం పండిస్తే మనం ఎకరాకు 30 క్వింటాళ్లు మాత్రమే పండించగలుగుతున్నామని తెలిపారు. వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి చెంగిచెర్లలోని నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ను శనివారం ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మాంసంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి సమానంగా పండించగలిగితేనే లాభాలు సాధ్యమని చెప్పారు. దేశంలోని గొర్ల సంపదలో తెలంగాణలోనే 2 కోట్ల జీవాలు ఉన్నాయని, అయినా మాంసం దిగుబడి అధికంగా వచ్చే బ్రీడ్స్ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఉత్పాదకత పెంపు కోసం స్థానిక భాషలో వివరాలను ముద్రించి గొర్రెల, మేకల పెంపకందారులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
మాంసం ఎగుమతిపై దృష్టి పెట్టాలి
రాష్ట్రంలో గొర్రెల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. కంది, జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ, ఉలవ, మినుము పంటల నూర్పిడి తర్వాత మిగిలే గ్రాసాన్ని గొర్రెల మేతగా ఉపయోగించాలని గొర్రెల పెంపకందారులకు సూచించారు. మనదేశంలో మార్పు మొదలైతే వేగంగా పెను మార్పులకు దారితీస్తుందని, జీవాల పెంపకందారులు సొసైటీలుగా ఏర్పడి మాంసం ఎగుమతులపై దృష్టిసారించాలని కోరారు. నిజాం మునిమనవడు ఆస్ట్రేలియాలో గొర్రెల పెంచుతున్నారని, మంచిపని చేసేందుకు ఎప్పుడూ నామోషీగా భావించకూడదని అన్నారు. వనపర్తిలో అత్యాధునిక స్లాటర్ హౌస్, మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్బీ బర్బుద్ధే, ప్రిన్సిపల్ సైంటిస్ట్ బస్వారెడ్డి, జేడీ వెంకటేశ్వర్రెడ్డి, వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం చైర్మన్ కురుమూర్తియాదవ్, వైస్ చైర్మన్ చంద్రయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.