సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ యజ్ఞాన్ని ప్రారంభించానని ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్, సేవ్ సాయిల్ మూవ్మెంట్ సంయుక్తాధ్వర్యంలో శిల్పారామంలోని రాక్ హైట్స్ సంగీత విభావరి నిర్వహించారు. అంతకు ముందు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 25 సంవత్సరాలుగా మొకలు పెంపొందించడంపై అవగాహన కల్పిస్తున్నారని, ఆయన స్ఫూర్తితోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్తో రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీ సంపద 33 శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఉండేవని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆ ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ రహితంగా మార్చామని, మట్టి గొప్పతనం గురించి సద్గురు చెప్పినట్లు ఆయన సంకల్పానికి సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం జరిగిన సంగీత విభావరిలో ప్రముఖ గాయకులు మంగ్లీ, రామ్ మిరియాల, రమ్య బెహ్రా , సాహితీ చాగంటి, శ్రీలలిత, సందీప్ తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ వెంకటేశ్వరరావు, ఆర్గానిక్ రైతు నాగరత్నం నాయుడు, సేవ్ సాయిల్ మూవ్మెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.