సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు, ప్రజలు వ్యయ ప్రయాసలకు గురవకుండా చూసేందుకు ప్రభుత్వం నిత్యం బృహత్తర ప్రణాళికలను రచిస్తూనే ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ నగరంగా చేసేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు విడతల వారీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కూకట్పల్లి నియోజకవర్గంలో కైత్లాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు రూ.83 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరాయి. వచ్చే నెల మొదటి వారంలో ఈ బ్రిడ్జిని ప్రారంభించే దిశగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా మలేషియా టౌన్షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్స్ జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. సనత్నగర్, బాలానగర్, మూసాపేట ప్రాంతాల మీదుగా వచ్చే వాహనదారులకు హైటెక్ సిటీ మార్గం ఐదు కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు గంట సమయం ఆదా కానుంది.
రూ.83.06 కోట్లతో ఆర్వోబీ నిర్మాణం
కైత్లాపూర్ ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణానికి గాను ప్రభుత్వం రూ.83.06 కోట్లు ఖర్చు చేసింది. రైల్వే పనులకు గాను రూ.18.06 కోట్లు, భూ సేకరణకు రూ.25 కోట్లు, నిర్మాణానికి జీహెచ్ఎంసీ రూ.40 కోట్లు వెచ్చించింది. 675.50 మీటర్ల పొడవులో ఆర్వోబీ చేపట్టింది. 46 మీటర్ల మేర రైల్వే స్పాన్, 16.61 మీటర్లలో నాలుగు లేన్ల బై డైరెక్షనల్లో నిర్మాణం జరిగింది. 5.50 మీటర్లలో సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు.
ఐదు కిలో మీటర్ల దూరం తగ్గి..
కూకట్పల్లి-హైటెక్ సిటీలను అనుసంధానం చేస్తూ మరో రైల్వే బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది. ఇప్పటి వరకు కేపీహెచ్బీ – హైటెక్ సిటీల మధ్య బ్రిడ్జి ఉండగా, ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దానికి సమాంతరంగా కైత్లాపూర్ వద్ద కూకట్పల్లి, మాదాపూర్ అయ్యప్ప సొసైటీని కలుపుతూ ఆర్వోబీ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ద్వారా ప్రస్తుతం ఉన్న జేఎన్టీయూ, హైటెక్ సిటీ బ్రిడ్జిలపై వాహనాల రద్దీ తగ్గుతుంది. మలేషియా టౌన్షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్స్ జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. సనత్నగర్, బాలానగర్, మూసాపేట ప్రాంతాల మీదుగా వచ్చే వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా హైటెక్ సిటీకి సులువుగా చేరుకోవచ్చు. దీంతో జేఎన్టీయూ మీదుగా హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దాదాపు 5 కిలోమీటర్ల మేర దూరభారం తగ్గుతుంది. సుమారు గంట సమయం ఆదా అవడంతో పాటు సులువుగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది.