వ్యవసాయ యూనివర్సిటీ , మే 23 : రాష్ట్ర రైతాంగం ప్రతి ఏటా పండుగగా జరుపుకునే విత్తన మేళా మంగళవారం జరుగనున్నట్లు ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రవీణ్రావు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాగులో విప్లవాత్మక మార్పు వచ్చిందన్నారు. వానకాలం పంటకు సన్నద్ధమవుతున్న రైతన్నకు నేల పరిస్థితి తదితర అంశాలపై అవగాహన కల్పించి, తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో ఎక్కువ ధరలు చెల్లించి నాణ్యత లేని విత్తనాలు కొని మోసపోవద్దని ఆయన సూచించారు. తెలంగాణలో ప్రధాన పంటలైన వరి, కంది, మొక్కజొన్న, జొన్న, రాగులు, పత్తి , మిర్చి తదితర 8 పంటలు 44 రకాలకు చెందిన 15 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.
వీటితో పాటు పంటలకు చీడపీడలు, తెగుళ్లు సోకకుండా ముందు జాగ్రత్తలు, ఒకవేళ సోకితే వాడాల్సిన పురుగు మందులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచనలు, సలహాలు అందిస్తారని చెప్పారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగనున్న ఈ మేళాకు ఉద్యాన విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, నూనెగింజల పరిశోధనా కేంద్రం రూపొందించిన వంగడాలు, సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారని తెలిపారు. సోమవారం యూనివర్సిటీ పరిధిలోని ఆడిటోరియంలో జరుగుతున్న ఏర్పాట్లను రిజిస్ట్రార్ సుధీర్కుమార్, రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తదితరులు పరిశీలించారు.